అంబేద్కర్ స్మృతివనాన్ని మార్చొద్దు
ABN , First Publish Date - 2020-07-08T17:28:26+05:30 IST
అంబేద్కర్ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ..

అమరావతిలోనే నిర్మించాలి
రాజధాని దళిత జేఏసీ నేతల డిమాండ్
203వ రోజు కొనసాగిన రాజధాని ఆందోళనలు
తుళ్లూరు, తాడికొండ(గుంటూరు): అంబేద్కర్ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ దళిత జేఏసీ నేతలు తెలిపారు. శాఖమూరులోని అంబేద్కర్ స్మృతివనం ప్రాంతంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణం కోసం ఇప్పటికే 1,500 టన్నుల ఐరన్ వాడారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం స్మృతివనాన్ని తొలుత గుంటూరుకు మార్చుతున్నట్టు, ఆ తర్వాత విజయవాడకు మారుస్తున్నట్లు పలు ప్రకటనలు చేస్తోందన్నారు.
అమరావతిలోనే అంబేద్కర్ స్మృతివనం ఉండాలని, లేదంటే తాము తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. వెంటనే రాజధాని అమరావతిలోనే అంబేద్కర్ స్మృతివనం పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత జేఏసీ నేతలు గడ్డం మార్టిన్, ముళ్లమూడి రవి, బేతపూడి సుధాకర్, పులి చిన్నా, మరియదాసు, మట్టుపల్లి గిరీష్, చేకూరి రవి, నాగరాజు మాస్టారు కార్యకర్తలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
203వ రోజుకు చేరుకున్న ఉద్యమం
అమరావతి రాజధాని ఉద్యమం మంగళవారం 203వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి మందడం, వెలగపూడి, రాయపూడి, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక తదితర గ్రామాల్లో రైతులు ఇళ్ల నుంచే రాజధాని ఉద్యమాన్ని కొనసాగించారు. ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనం కోసం మూడు రాజధానులు ప్రతిపాదన తీసుకువచ్చారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరారు.