-
-
Home » Andhra Pradesh » Guntur » Do not sell these drugs without a voucher
-
చీటీ లేకుండా ఈ మందులు విక్రయించొద్దు!
ABN , First Publish Date - 2020-03-24T15:28:41+05:30 IST
రోగుల వద్ద మందుల చీటీ లేనిదే..

గుంటూరు(ఆంధ్రజ్యోతి): రోగుల వద్ద మందుల చీటీ లేనిదే క్లోరోక్విన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్, ఎజిత్రోమైసిన్ మందులు విక్రయించవద్దని జిల్లా ఔషధ తనిఖీ, నియంత్రణ శాఖ అధికారులు... రిటైల్ మందుల దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిడ్స్ చికిత్సలో వినియోగించే లొపనావీర్, రెటినోవీర్ మందులను కూడా ప్రిస్కిప్షన్ లేదని అమ్మవద్దని స్పష్టం చేశారు. కరోనా వైరస్ భయంతో పలువురు ఈ మందులను సొంతంగా వాడుతున్నట్లు ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దృష్టికి రావడంతో జిల్లావ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులకు ఈ మేరకు సర్క్యులర్లు జారీ చేసినట్లు తెలిసింది.
ఫ్రాన్స్లో కొంతమంది కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ కాంబినేషన్ మందులు వాడుతున్నారు. దీని వల్ల రోగుల్లో మెరుగైన ఫలితాలు కనిపించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సమాచారం సరైనదా? కాదా? అని నిర్ధారించుకోకుండానే పలువురు జలుబు, జ్వరాలకు ఈ మందులు వాడుతున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును మలేరియా జ్వరానికి, ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నియంత్రణకు వాడతారు. అజిత్రోమైసిన్ మందును పలు రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు, బ్రాంకైటిస్, న్యూమోనియా వ్యాధుల చికిత్సల్లో వినియోగిస్తారు.
ఈ రెండు రకాల మందులు కోవిడ్-19 వ్యాధి నియంత్రణకు బాగా పని చేస్తున్నాయనే ప్రచారంతో పలువురు వీటిని కొని వాడుతున్నట్లు ఔషధ తనిఖీ శాఖ అధికారులు గుర్తించి వాటి నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాను కరోనా వైరస్ భయం వణికిస్తోంది. కాస్త ఒళ్లు వెచ్చబడి, జలుబు, దగ్గు దాడి చేస్తే చాలు కోవిడ్-19 కావచ్చనే భయం వెంటాడుతోంది. బాధితులు ఈ మందులు వాడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలోని రిటైల్ ఔషధ దుకాణదారులు మందుల చీటీ లేకుండా ఈ నాలుగు రకాల మందులు ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని డ్రగ్ కంట్రోల్ అధికారులు నియంత్రణ విధించారు. నిబంధనలు పాటించని వ్యాపారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.