కొవిడ్ వ్యాక్సిన్కు సమాయత్తం
ABN , First Publish Date - 2020-12-15T05:50:49+05:30 IST
కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తామని కలెక్టర్ ఆనంద్కుమార్ తెలిపారు.
హెల్త్కేర్ ఉద్యోగులకు తొలి ప్రాధాన్యం
కలెక్టర్ శ్యామూల్ ఆనంద్కుమార్
గుంటూరు(తూర్పు), డిసెంబరు14: కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ను ప్రారంభిస్తామని కలెక్టర్ ఆనంద్కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి టాస్క్ఫోర్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల డాక్టర్లు, సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, రెండో ప్రాధాన్యంలో పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తారన్నారు. ఆ తర్వాత 50 ఏళ్లు దాటినవారికి, 60 ఏళ్ల లోపు ఉన్న దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్ అందిస్తారని తెలిపారు. 35వేల మంది హెల్త్కేర్ ఉద్యోగుల వివరాలను నమోదు చేశామన్నారు. వ్యాక్సిన్కు సంబంధించిన డ్రైస్పేస్ మెటీరియల్ నిల్వకోసం ఆర్అండ్బీ విభాగంలో గోడౌన్లు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో రీజినల్ స్టోర్ను ఏర్పాటు చేశామని ఇక్కడినుంచే ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా అవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జేసీ ప్రశాంతి, డీఎంహెచ్ఓ జె.యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.