తగ్గుతూ.. పెరుగుతూ
ABN , First Publish Date - 2020-10-21T11:57:39+05:30 IST
జిల్లాలో కరోనా కేసుల్లో హెచ్చు, తగ్గుదలలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు 250 మధ్యనే పాజిటివ్ కేసులు వస్తుండగా మరుసటి రోజు ఇంచుమించు 400 వరకు వస్తున్నాయి.

జిల్లాలో కేసుల హెచ్చు, తగ్గుదల
కొత్తగా 387 మందికి కరోనా పాజిటివ్
గుంటూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల్లో హెచ్చు, తగ్గుదలలు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు 250 మధ్యనే పాజిటివ్ కేసులు వస్తుండగా మరుసటి రోజు ఇంచుమించు 400 వరకు వస్తున్నాయి. వారం రోజుల నుంచి జిల్లాలో ఇదే పరిస్థితి. మంగళవారం కొత్తగా 387 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 64,687కి చేరింది. కరోనాతో పోరాడి మరో ముగ్గురు చనిపోగా మొత్తం సంఖ్య 654కి పెరిగింది. తాజాగా గుంటూరు నగరంలో 88, బాపట్ల - 26, రేపల్లె - 26, చిలకలూరిపేట - 22, మంగళగిరి - 21, తెనాలి - 21, నరసరావుపేట - 20, తాడేపల్లి - 17, సత్తెనపల్లి - 15, దుగ్గిరాలలో 10 పాజిటివ్ కేసులు వచ్చాయి. మిగిలిన మండలాల్లో మరో 121 మందికి కరోనా సోకినట్లు డీఎంహెచ్వో డాక్టర్ జే యాస్మిన్ తెలిపారు.
నేటి నుంచి అవగాహన
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు బుధవారం నుంచి పది రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అవగాహన, ఛైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది. తొలి రోజున గుంటూరులో కలెక్టరేట్ నుంచి గుంటూరు నగరపాలకసంస్థ కార్యాలయం వరకు, మండల, మునిసిపాలిటీ, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు డివిజనల్ స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొటోకాల్స్పై చర్చిస్తారు.