నగరవాసి.. పల్లెబాట
ABN , First Publish Date - 2020-03-25T09:25:23+05:30 IST
కరోనా హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో పట్టణ, నగరవాసులు తమతమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు.
ముందుజాగ్రత్తగా కొందరు.. ఖర్చులు తట్టుకోలేక మరి కొందరు
గుంటూరు(సంగడిగుంట), మార్చి 23: కరోనా హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో పట్టణ, నగరవాసులు తమతమ స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. విదేశాల నుంచి కూడా జిల్లాలోని స్వగ్రామాలకు ఎందరో వచ్చారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ హెచ్చరికలతో గుంటూరుతో పాటు, వివిధ పట్టణాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. విద్యాసంస్థలకు, కొన్ని ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో పల్లెలకు పయనం అయ్యే కుటుంబాల సంఖ్యలో రెండు రోజులుగా పెరిగింది. ఉద్యోగస్తులైన పురుషులు మాత్రమే కొన్ని కుటుంబాల్లో ఉండగా సెలవులు ఇచ్చిన ఉద్యోగస్తులు తరలి వెళ్ళిపోతున్నారు. వీరు కాక కేవలం ఉపాధిపైనే నగరంలో బతికే కుటుంబాలు అది ఇప్పట్లో దొరికే అవకాశం లేకపోవడంతో కుటుంబాలతో వెళ్ళిపోతున్నారు. పల్లెల్లో వైరస్ గోల ఉండదని కొందరు ఇలా రకాల కారణాలతో నగరంలోని పల్నాడు, ప్రకాశం జిల్లాకు చెందిన కుటుంబాలు తరలి వెళ్లిపోయాయి.