స్వస్థలాలకు సురక్షితంగా చేరుస్తాం..
ABN , First Publish Date - 2020-05-24T08:05:36+05:30 IST
జిల్లాలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులందరినీ ప్రభుత్వం ఖర్చులతో టిక్కెట్లు కొని ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా స్వస్థలాలకు సురక్షితంగా చేరుస్తామని..

వలస కార్మికులకు కలెక్టర్ ఆనంద్కుమార్ హామీ
గుంటూరు, చిలకలూరిపేట, మే 23: జిల్లాలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులందరినీ ప్రభుత్వం ఖర్చులతో టిక్కెట్లు కొని ప్రత్యేక శ్రామిక రైళ్ల ద్వారా స్వస్థలాలకు సురక్షితంగా చేరుస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్కుమార్ స్పష్టం చేశారు. చిలకలూరిపేట ప్రాంతంలోని బొప్పూడి చెక్పోస్టు, ఫార్కార్నర్స్ ఇండియా ఇంటర్నేషనల్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద పునరావాస కేంద్రాలను శనివారం ఆయన సందర్శించి అందుతున్న సౌకర్యాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
ఫార్కార్నర్స్ సంస్థ వద్ద ఎమ్మెల్యే విడదల రజిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500మంది కార్మికులకు భోజనాలను కలెక్టర్, ఎమ్మెల్యే వడ్డించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 40 రైళ్ల ద్వారా 50వేల మంది కార్మికులను వారి వారి సొంత ఊర్లకు చేర్చామన్నారు. అంతకుముందు కాజా టోల్ప్లాజా వద్ద ట్రక్పై వెళుతున్న వలస కార్మికులను కలెక్టర్ గమనించి వారిని ఏఎన్యూలోని పునరావాస కేంద్రానికి తరలించారు. రైళ్లు వచ్చే వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.