బ్యాంకులో భారీ చోరీ

ABN , First Publish Date - 2020-11-22T04:53:57+05:30 IST

దాచేపల్లి నగర పంచాయతీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నడి కుడి శాఖలో రూ.85లక్షల నగదు చోరీకి గురైంది.

బ్యాంకులో భారీ చోరీ
నడికుడి ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్‌ కృష్ణారెడ్డి నుండి వివరాలు తెలుసుకుంటున్న గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

రూ.85లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

నడికుడి ఎస్‌బీఐలో ఘటన

పరిశీలించిన రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ 


దాచేపల్లి, నవంబరు 21:
దాచేపల్లి నగర పంచాయతీలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నడి కుడి శాఖలో రూ.85లక్షల నగదు చోరీకి గురైంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. శుక్రవారం రాత్రి విధుల అనంతరం సిబ్బంది యధావిధిగా బ్యాంకు కు తాళాలు వేశారు. తెల్లవారుజామున బ్యాంకు ఆవరణను శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి గేటుకు తాళాలు తీసి ఉండడాన్ని గమనించింది. వెంటనే బ్యాంక్‌ మేనేజర్‌ కృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చింది. బ్యాంకుకు చేరుకున్న ఆయన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. బ్యాంకు లాకర్‌లో ఉన్న రూ.85లక్షల నగదు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పాటు వేలిముద్ర నిపుణులు, డాగ్స్‌ స్వ్కాడ్‌, సీసీ కెమెరా నిపుణులు బ్యాంకుకు చేరుకొని ఆధారాలు సేకరించారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీ లించారు. ఎటువంటి ఆధారాలు లభించకుండా దొంగలు చాలా చాకచక్యంగా వ్యవహరించారని తెలిపారు. వేలిముద్రలు పడకుండా చేతికి గ్లౌజులు వాడటమే కాకుండా సీసీ కెమెరాల్లో తమ ముఖా లు కనిపించకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. డాగ్‌ స్వ్కాడ్‌ వాసన పసిగట్టకుండా దొంగలు సంచ రించిన ప్రాంతమంతా కారం పొడి చల్లారన్నారు. బ్యాంకుకు వేసిన తాళాలను గ్యాస్‌ కట్టర్‌ ద్వారా కట్‌ చేశారు. దొంగలను పట్టుకునేందుకు అడిషనల్‌ ఎస్పీ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేసినట్లు ఎస్పీ వివరించారు. ప్రజల వద్ద ఏమై నా సమాచారమున్నా, ఎటువంటి ఆధారాలున్నా వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 8866268899కు తెలిపాలని సూచించారు. కాగా 2013లో నారాయణ పురంలో ఎస్‌బీఐ నడికుడి శాఖలో దొంగలు చోరీకి యత్నించి విఫలమయ్యారు.  


Updated Date - 2020-11-22T04:53:57+05:30 IST