వికేంద్రీకరణతో రాష్ట్రం అధోగతి
ABN , First Publish Date - 2020-08-05T10:20:42+05:30 IST
వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి ధ్వజమెత్తారు.
ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి
గుంటూరు, ఆగస్టు 4: వికేంద్రీకరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి ధ్వజమెత్తారు. గుంటూరు రాజీవ్గాంధీ భవన్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో మాట తప్పం మడమతిప్పం అన్నవాళ్ళు ఇప్పుడు మాట తప్పి మడం తిప్పారని విమర్శించారు. ఇక్కడే ఇల్లు కట్టుకున్నామం.. రాజధాని అమరావతే అని ఎన్నికలకు ముందు జగన్ చెప్పారన్నారు. రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు.
కరువు కాటకాలతో అల్లాడుతోన్న రాయలసీమలో న్యాయ రాజధానితో ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. అక్కడ కావాల్సిన నీటి వనరులు, నిరుద్యోగ సమస్య, అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలన్నారు. ఇప్పటికే ఆర్ధిక నగరంగా అభివృద్ధి చెందిన విశాఖలో పరిపాలన రాజధానితో మీరు చేసే అభివృద్ధి ఏముందని ప్రశ్నించారు. పునర్విభజన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్రెడ్డి, నాయకులు జక్కా శ్రీనివాసరావు, గురవయ్య, అడవి ఆంజనేయులు, గోపాలకృష్ణ తదితరులున్నారు.