మరోమారు మద్యం షాపులపై కోత
ABN , First Publish Date - 2020-05-10T07:05:11+05:30 IST
జిల్లాలో మరోమారు ప్రభుత్వం మద్యంషాపులు తగ్గించేందుకు రంగం సిద్ధం చేసింది.
13 శాతం తొలగింపునకు రంగం సిద్ధం
జిల్లాలో 36 మద్యంషాపులు తగ్గింపు
నెలాఖరులోగా చర్యలు తీసుకోనున్న అధికారులు
గుంటూరు కార్పొరేషన్, మే 9: జిల్లాలో మరోమారు ప్రభుత్వం మద్యంషాపులు తగ్గించేందుకు రంగం సిద్ధం చేసింది. శనివారం అధికారికంగా వెలువడిన ఉత్తర్వుల ప్రకారం... ఈ నెలాఖరులోగా 13శాతం మేర మద్యం షాపులు తగ్గించనున్నారు. ఇప్పటికే కొత్తమద్యం పాలసీని అమలు చేస్తూ ప్రైవేటు వ్యక్తుల నుంచి షాపులను తీసుకొని ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయం విదితమే.
గతంలో జిల్లావ్యాప్తంగా 352 మద్యంషాపులు ఉండగా గతేడాది అక్టోబరు 1నుంచి వాటిలో 20శాతం కోత విధించి జిల్లావ్యాప్తంగా 282 మద్యంషాపులు మాత్రమే తెరిచారు. తాజాగా 13 శాతం కోత విఽధించటంతో మరో 36షాపులను తొలగించనున్నారు. గుంటూరు డివిజన్లో 72 మద్యం షాపులకుగాను 9, తెనాలి డివిజన్లో 95 షాపులకుగాను 12, నరసరావుపేట డివిజన్లో 115 షాపులకు గాను 15 షాపులు తొలగించనున్నారు. జిల్లావ్యాప్తంగా 36 మద్యంషాపులను తొలగిస్తుండడంతో ఈ నెలాఖరుకు 246 మద్యం షాపులు మాత్రమే ఉంటాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.