పోరు ఆపం
ABN , First Publish Date - 2020-05-13T09:35:44+05:30 IST
అమరావతి పోరు ఆపేది లేదు.. కోర్టులు ఇచ్చిన తీర్పులకు వేరే భాష్యం చెబుతూ
రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మేది ఎలా?
147వ రోజు ఆందోళనలో అమరావతి రైతుల ఆగ్రహం
గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, మే 12: అమరావతి పోరు ఆపేది లేదు.. కోర్టులు ఇచ్చిన తీర్పులకు వేరే భాష్యం చెబుతూ తామనుకున్న పనిని కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మేది ఎలా అని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పాలన అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు మంగళవారానికి 147వ రోజుకు చేరాయి. తమతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల ప్రకారం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అనంతవరం, తుళ్లూరు, నెక్కల్లు, వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు, మందడం, దొండపాడు, పెదపరిమి, ఉద్దండరాయునిపాలెం, నీరుకొండ, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం తదితర 29 గ్రామాల రైతులు నిరసనలు కొనసాగించారు. అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ అమరావతి వెలుగు కార్యక్రమం చేపట్టారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు 23వ రోజు ఆందోళనలు కొనసాగించారు.