అమరావతితోనే.. మా భవిత
ABN , First Publish Date - 2020-03-30T10:05:08+05:30 IST
‘అమరావతితోనే మా భవిత.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం దిగి రావాలి.
103వ రోజూ అమరావతి నిరసనలు
గుంటూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతితోనే మా భవిత.. మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం దిగి రావాలి. లేకుంటే ఊపిరి ఉన్నంత కాలం మెడలో ఆకుపచ్చ కండవా, చేతిలో ఆకుపచ్చ జెండాతో పోరు సాగిస్తునే ఉంటాం..’ అని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెప్పారు. అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా ప్రకటించాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారం 103వ రోజుకు చేరాయి.
నమ్మి ఓటేసిన పాలకులు మోసం చేశారని, ఓట్ల కోసం మా ఇంటి ముందుకు వచ్చిన వారు నేడు తప్పించుకు తిరుగుతున్నారంటూ తుళ్లూరు, మందడం, అనంతవరం, రాయపూడి, వెంకటపాలెం, నేలపాడు, దొండపాడు తదితర ప్రాంతాల రైతులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం ఎన్నుకున్న ఎమ్మెల్యే ఏమైందో అర్ధం కావటం లేదన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా తమ పోరు ఆగదన్నారు. రాత్రి 7.30 గంటలకు విద్యుత్ నిలిపి కొవ్వొత్తులతో ‘అమరావతి వెలుగు’ పేరిట రాజధాని మహిళలు నిరసన ప్రదర్శన చేశారు. నిరసనలో భాగంగా మహిళలు పచ్చరంగు మాస్కులను తయారు చేసి వాటిని ఉద్యమకారులకు పంచారు.