యువకుడి దారుణ హత్య
ABN , First Publish Date - 2020-12-30T05:29:13+05:30 IST
రాజమహేంద్రవరానికి చెందిన ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా వున్నాయి...
- తల నరికి సంచిలో మూటకట్టి చెరువులో పడేసిన వైనం
రాజమహేంద్రవరం సిటీ/దివాన్చెరువు, డిసెంబరు 29: రాజమహేంద్రవరానికి చెందిన ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు ఇలా వున్నాయి... శాంతిపురానికి చెందిన రొంగల దుర్గాప్రసాద్ (22) ఆటో సర్వీసు తిప్పుతుంటాడు. తల్లిదండ్రులు కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 13న ఇంటి నుంచి బయటకు వెళ్లిన దుర్గాప్రసాద్ తిరిగి రాకపోవడంతో తండ్రి 15న బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన వారు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం రాజానగరం మండలం భూపాలపట్నం చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు రాజానగరం పోలీసులకు సమాచారం అందింది. రాజానగరం సీఐ సుభాష్ సంఘటనాస్థలానికి చేరుకుని తెల్ల సంచిలో మూటకట్టిన మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం పురుషుడిది కావడంతో బొమ్మూరు పోలీసులకు సమాచారం అందించారు. మిస్సింగ్ కేసు నేపథ్యంలో శాంతిపురానికి చెందిన దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించి అక్కడికి తీసుకెళ్లారు. మృతదేహం చేతిపై ఉన్న ప్రసాద్ అనే పచ్చబొట్టు ఆధారంగా దుర్గాప్రసాద్ అని గుర్తించారు. ఈ నెల 13న అదృశ్యమైన దుర్గాప్రసాద్ 29న భూపాలపట్నంలో చెరువులో తేలడం, తలనరికి సంచిలో మూటకట్టి పడేసి ఉండడంతో దీని వెనుక వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శవం బాగా కుళ్లిపోయి ఉందని, 15 రోజుల క్రితమే అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుభాష్ తెలిపారు.