పోరాటం ఆగదు
ABN , First Publish Date - 2020-11-03T05:52:29+05:30 IST
ఏలేరు ఆధునికీకరణ పనులు పూర్తయ్యేవరకు తమ పోరాటం ఆగదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ
పిఠాపురం, నవంబరు 2: ఏలేరు ఆధునికీకరణ పనులు పూర్తయ్యేవరకు తమ పోరాటం ఆగదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. పోలీసులు, అరెస్టులతో తమను భయపెట్టలేరన్నారు. పిఠాపురం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు ప్రజాప్రతినిఽదులు ప్రజలకు చేసిందేమి లేదన్నారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణ టీడీపీ హయాంలో రూ.136 కోట్లు మంజూరు చేయించామని, వైసీపీ నేతలు మాత్రం ఖరారయిన టెండర్లు రద్దు చేయించి నేటి వరకూ పట్టించుకోలేదని వివరించారు. వరద ముంపు నుంచి శాశ్వత రక్షణ కల్పించే విధంగా పనులు ప్రారంభించి పూర్తి చేసేవరకు విశ్రమించేది లేదని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి డిపార్ట్మెంట్లకు షాడో ఎమ్మెల్యేలు ఏర్పాటు చేసుకుంటున్నారని, ఇది విడ్డూరంగా ఉన్నా వాస్తవమని తెలిపారు. రైతుల పక్షాన తాను చేపట్టిన పాదయాత్ర, తదనంతరం పోలీసులు అడ్డుకున్న సమయంలో అండగా నిలిచిన నాయకులు, కార్యకర్తలు, రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
పోరాటంలో అండగా ఉంటాం: జ్యోతుల నవీన్
ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణకు వర్మ చేపట్టిన పోరాటానికి మద్దతుగా ఉంటామని టీడీపీ కాకినాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తెలిపారు. ఆయన సోమవారం వర్మను కలిసి సంఘీభావం తెలిపారు.