రాజకీయ కక్షతోనే మాధవాయిపాలెం రేవు మూసివేత

ABN , First Publish Date - 2020-12-11T05:42:50+05:30 IST

రాజకీయ కక్ష, కమీషన్ల కోసమే మాధవాయిపాలెం రేవులో పంటు, పడవల రాకపోకలను అధికార పార్టీ నాయకులు నిలిపి వేయించారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు.

రాజకీయ కక్షతోనే మాధవాయిపాలెం రేవు మూసివేత
పంటుపై ధర్నాచేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

  • ఉభయ గోదావరి జిల్లాల మధ్య పంటు, పడవల రాకపోకలను పునరుద్ధరించాలి
  • టీడీపీ నేతల ధర్నా

అంతర్వేది/నరసాపురం, డిసెంబరు 10: రాజకీయ కక్ష, కమీషన్ల కోసమే మాధవాయిపాలెం రేవులో పంటు, పడవల రాకపోకలను అధికార పార్టీ నాయకులు నిలిపి వేయించారని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆరోపించారు. ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు పునరుద్ధరించాలంటూ టీడీపీ అధ్వర్యంలో గురువారం రేవులోని ఖాళీ పంటుపై ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని రేవుల్లో రాకపోకలు సాగుతున్నాయన్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలతో ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే మాధవాయిపాలెం రేవును మూసివేయడం  వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని అరోపించారు. ప్రజలు ఇబ్బందిని పట్టించుకోకుండా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ను సాకుగా చూపి పంటును తిప్పకపోవడం సరికాదన్నారు. తొమ్మిది నెలలుగా రాకపోకలు నిలిపివేయడంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిచి రేవులో రాకపోకలను పునరుద్ధరించాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో పొత్తూరి రామరాజు, టీడీపీ మహిళా విభాగం నరసాపురం పార్లమెంటరీ అధ్యక్షురాలు రత్నమాల, కొప్పాడ రవి, రాయుడు శ్రీరాములు, పొన్నాల నాగబాబు, జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, భూపతి నరేష్‌, అధికారి అనంతరామారావు, మల్లాడి మూర్తి, షేక్‌ హుసేన్‌, తాడి సత్యనారాయణ, పిండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T05:42:50+05:30 IST