పోలవరం ప్రాజెక్టు సందర్శిస్తే నేరం ఏమిటి?: గోరంట్ల
ABN , First Publish Date - 2020-11-22T18:07:29+05:30 IST
పోలవరం పరిరక్షణ యాత్రను అడ్డుకోవడానికి సీపీఐ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు.
రాజమండ్రి: పోలవరం పరిరక్షణ యాత్రను అడ్డుకోవడానికి సీపీఐ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి బయటపడుతుందనే కారణంతోనే సీపీఐ నేతలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్రాజెక్టు సందర్శిస్తే నేరం ఏమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయ్యిందన్నారు.
పోలవరం ఎత్తు తగ్గిస్తే ఎత్తిపోతల పథకాల ద్వారానే నీరు అందించాల్సి వస్తుందని వెల్లడించారు. పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే రెండు సార్లు కోర్టు బోనులు ఎక్కారని... మరోసారి కోర్టు బోను ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు. కేంద్రమే నూరు శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు భ్రష్టు పట్టడానికి ముఖ్య కారకుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అని గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.