అటవీ హక్కులతో గిరిజనులకు సుస్థిర జీవనోపాధి
ABN , First Publish Date - 2020-10-03T07:29:48+05:30 IST
అటవీ హక్కులతో గిరిజనులకు సుస్థిర జీవనోపాఽధి కలగనుందని సీఎం జగన్మోహనరెడ్డి అన్నారు
జిల్లాలో అటవీ భూముల హక్కుల పంపిణీని ప్రారంభించిన సీఎం జగన్
50 వేల ఎకరాల్లో పట్టాల పంపిణీ లక్ష్యం
రంపచోడవరం, అక్టోబరు 2: అటవీ హక్కులతో గిరిజనులకు సుస్థిర జీవనోపాఽధి కలగనుందని సీఎం జగన్మోహనరెడ్డి అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో 50 వేల ఎకరాల అటవీ భూములకు సంబంధించి అర్హులైన గిరిజనులకు దూరదృశ్య సమావేశం ద్వారా 20 వేల మందికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా కొండపోడులు సాగు చేసుకుంటున్న గిరిజనులకు చట్టరీత్యా దక్కాల్సిన హక్కులను తాము ఎంతో సగర్వంగా దక్కింపజేస్తున్నామన్నారు. జిల్లాలో అటవీ హక్కులకు సంబంధించి 3వ విడతతో కలిపి ఇంతవరకూ అందిన హక్కుల వివరాలను కలెక్టర్ మురళీధరరెడ్డి సీఎంకి వివరించారు. రంపచోడవరం డివిజ న్లో ఇంతవరకు 15,304 మందికి 39,946 ఎకరాల వ్యక్తిగత అటవీ హక్కులను, 12,334 మందికి 49,506 ఎకరాల కమ్యూనిటీ హక్కులను కల్పించామన్నారు.
చింతూరు డివిజన్ పరిధిలో 2508 మందికి 6542 ఎకరాల అటవీ భూమికి వ్యక్తిగత హక్కులను, 30 మందికి 1896 ఎకరాల కమ్యూనిటీ హక్కులను కల్పించామన్నారు. పెద్దాపురం డివిజన్లో 932 మందికి 2 వేల ఎకరాల వ్యక్తిగత హక్కులను కల్పించామన్నారు. వై.రామవరం మండలం పల్లాల వెంకటలక్ష్మి అనే గిరి జన మహిళతో సీఎం సంభాషించారు. అనంతరం డీసీసీబీ అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్(బాబు) మాట్లాడుతూ ఎన్నడూ జరగని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఎమ్మెల్యే నాగుళ్లపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పట్ల గిరిజనుల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు. రంపచోడవరం ఐటీడీఏ ఇన్ఛార్జి ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటరమణ, జిల్లా అటవీ అధికారి సునీల్కుమార్రెడ్డి, గిరిజన సంక్షేమ డీడీ సరస్వతి, ఏపీవో నాయుడు పాల్గొన్నారు.