రేపటి నుంచి బోటు టూరిజం.. అదీ వరద ఉధృతి తగ్గితేనే..
ABN , First Publish Date - 2020-08-14T14:50:35+05:30 IST
స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఆగస్టు 15 నుంచి గోదావరిలో బోటు టూరిజం ప్రారంభించే..
రాజమహేంద్రవరం, దిండిలో బోటింగ్
హోప్ఐలాండ్, దిండి హౌస్బోట్లకు అనుమతి కోసం ఎదురుచూపు
పాపికొండలలో రెండు బోట్లకు అనుమతి పరిశీలన
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఆగస్టు 15 నుంచి గోదావరిలో బోటు టూరిజం ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో 2స్పీడ్ బోట్లకు, దిండిలో రెండు స్పీడ్ బోట్లకు అనుమతి వచ్చింది. గోదావరి వరద ఉధృతి తగ్గితే స్పీడ్ బోట్లు నడపడానికి అధికారులు సిద్ధం గా ఉన్నారు. ఇక పాపికొండలలో విహారానికి టూరిజానికి చెందిన రెండు బోట్లకు, హోప్ ఐలాండ్ బోటుకు, దిండిలోని రెండు హౌస్ బోట్లకు అనుమతి కోసం పోర్టు అధికారులకు దరఖాస్తు చేశారు. వాటి అనుమతి కూడా రేపామాపో రావచ్చని అధికారులు చెబుతున్నారు. వాటికి అనుమతి వస్తే బోట్ షికార్ మళ్లీ మొదలైనట్టే.
దేవీపట్నం మండలం కచ్చులూరులో బోటు ప్రమాదం తర్వాత పాపికొండల షికారుతోపాటు రాష్ట్రంలో అన్నిచోట్ల టూరిజం బోట్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాష్ట్రంలో 6 కంట్రోలు రూమ్లు ఏర్పాటు చేసింది. వీటిలో రాజమహేంద్రవరంలో ఒక కంట్రోలు రూమ్ను ఏర్పాటు చేశారు. ఏపీ టూరిజం శాఖకు చెందిన రెండు బోట్ల కు అనుమతి లభిస్తే వరద సహాయ కార్యక్రమాల్లో కూడా వాటిని వాడుకోవాలని అధికారులు చూస్తున్నారు. వరద ఉధృతి ఉంటే బోటింగ్ జరగకపోవచ్చని, ఉధృతి తగ్గిన తర్వాతే బోటింగ్ ఉంటుందని ఒక అధికారి తెలిపారు. ఇటీవల టూరిజం శాఖ మంత్రి ఈనెల 15వ తేదీ నుంచి అన్ని ప్రాంతాలలోనూ టూరిజం ప్రారంభమవుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాపికొండలలో ప్రైవేట్ బోట్లకు ప్రస్తుతం అనుమతి లేదు. కొంతమంది బోట్ల యజమానులు మూడు నెలల పాటు తాత్కాలిక అనుమతి ఇవ్వవలసిందిగా కోరగా, పోర్ట్ అధికారులు తిరస్కరించినట్టు సమాచారం. జూలైలోనే దిండి, మారేడుమిల్లి రిసార్ట్స్లు ప్రారంభమయ్యాయి.