కొత్త రైల్వేలైన్కు వినతి
ABN , First Publish Date - 2020-11-27T05:57:39+05:30 IST
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు-భద్రాచలం మధ్య కొత్త రైల్వేలైన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ కోరారు. కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో గురువారం ఎంపీ పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 26: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు-భద్రాచలం మధ్య కొత్త రైల్వేలైన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ కోరారు. కేంద్ర మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో గురువారం ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వేకు సంబంధించిన పనులను మంత్రికి వివరించారు. కొవ్వూరు- భద్రాచలం మధ్య రైల్వే లైన్ నిర్మిస్తే అది దేఽశంలోనే చాలా ముఖ్యమైన రైల్వేలైన్గా ఏర్పడుతుందన్నారు. కొవ్వూరు- భద్రాచలం లైన్ ఏర్పాటు చేస్తే విజయవాడ జంక్షన్ బైపాస్ అవుతుందని, హైదరాబాద్కు ఈ ప్రాంతం నుంచి 70, 80 కిలో మీటర్ల దూరం కూడా తగ్గుతుందని చెప్పారు. అలాగే రాజమహేంద్రవరంలో తూర్పు రైల్వేస్టేషన్ వైపు చేపట్టిన అభివృద్ధి పనులు సత్వరమే పూర్తయ్యే విధంగా కృషి చేయాలని మంత్రిని ఎంపీ కోరారు. వీటీ కాలేజీ వద్ద రైల్వే ప్లైఓవర్ నిర్మాణం చేపట్టి నగరాభివృద్ధికి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. రైల్వేస్టేషన్ పశ్చిమవైపు మాస్టర్ ప్లాన్ రోడ్డును నిర్మించాలని ఇప్పటికే ప్రతిపాదించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తూర్పు రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేసి మరో ప్లాట్ఫాం నిర్మించాలని కోరారు. తూర్పు వైపు ఉన్న కోల్ సైడింగ్ యార్డును వేరొక చోటకు తరలించాలన్నారు. మూడో రైల్వేలైన్ కీలకమైందని, వారణాసి ఎక్స్ప్రెస్ గోదావరి ప్రాంతం నుంచే నడపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. హేవ్లాక్ బ్రిడ్జికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టూరిజం ద్వారా రూ.100 కోట్ల నిధులు విడుదల చేసిందని, రైల్వే శాఖ త్వరగా బ్రిడ్జిని అప్పగించాలని కేంద్రమంత్రిని ఎంపీ భరత్ కోరారు.