15న తొలి విడత..పంచాయతీ నోటిఫికేషన్
ABN , First Publish Date - 2020-03-13T09:29:11+05:30 IST
ఈనెల 15న పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ జారీ కానుంది. రెండో దశ 17న జారీ చేస్తారు. తొలి దశ ఎన్నికలకు 17 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న పరిశీలిస్తారు. 21న
![15న తొలి విడత..పంచాయతీ నోటిఫికేషన్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
17న రెండో విడత
మొదటి దశలో అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం డివిజన్లు
రెండో దశలో పెద్దాపురం, రామచంద్రపురం, రంపచోడవరం, ఎటపాక డివిజన్లు
తొలి దశకు 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ
27న పోలింగ్, అదే రోజు ఫలితాలు
(ఆంధ్రజ్యోతి, రాజమహేంద్రవరం)/కార్పొరేషన్(కాకినాడ):
ఈనెల 15న పంచాయతీ ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ జారీ కానుంది. రెండో దశ 17న జారీ చేస్తారు. తొలి దశ ఎన్నికలకు 17 నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20న పరిశీలిస్తారు. 21న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారు. 22న ఎవరైనా తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. 27న పోలింగ్ ఉంటుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
జిల్లాలో 1072 పంచాయతీలకుగాను మొదటి విడతగా 27న 516 పంచాయతీలకు, రెండో విడత ఈనెల 29న 556 పంచాయతీలకు నిర్వహించనున్నారు. తొలి దశ ఎన్నికలు అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో జరుగుతాయి. ఈ డివిజన్ల పరిధిలోని 30 మండలాల్లోని 516 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. వీటికోసం 6,134 పోలింగ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. రెండోదశ ఎన్నికలు పెద్దాపురం, రామచంద్రపురం, రంపచోడవరం, ఎటపాక డివిజన్లో జరుగుతాయి. 19 నుంచి 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
22న పరిశీలిస్తారు. 24న తుది జాబితా ప్రకటిస్తారు. 29న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు కూడా అప్పుడు ప్రకటిస్తారు. రెండోదశలో 31 మండలాల పరిధిలోని 556 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 5,914 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 32,52,837మంది ఓటర్లు ఈ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొననున్నారు. వీరికోసం మొత్తం 12,048 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం ఎన్నికల ప్రక్రియ ఈనెల 30తో ముగుస్తుంది. వాస్తవానికి ఈనెల 29వతేదీకే మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగియాల్సిఉంది. కానీ ఎక్కడైనా పంచాయతీలకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటే 30న నిర్వహిస్తారు.