ఏపీలో కరోనా స్ట్రెయిన్పై వైద్య శాఖ కమిషనర్ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-12-29T22:23:47+05:30 IST
ఏపీలో స్ట్రెయిన్ విస్తరించినట్లు ఆధారాలు లేవని వైద్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. రాజమండ్రి మహిళకు...
అమరావతి: ఏపీలో స్ట్రెయిన్ విస్తరించినట్లు ఆధారాలు లేవని వైద్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. రాజమండ్రి మహిళకు మాత్రమే యూకే స్ట్రెయిన్ వచ్చిందని తెలిపారు. ఆమె కుమారుడికి కూడా నెగటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ కమిషనర్ భాస్కర్ భరోసానిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళ ఒకరు ఈనెల 22న యూకే నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆమె కుమారుడు ఢిల్లీ వెళ్లారు. యూకేలో కరోనా పరీక్షలు చేయించుకున్నా అక్కడ ఫలితాలు రాకుండానే ఆమె బయలుదేరి భారత్కు వచ్చినట్టు తెలిసింది. స్వదేశంలో కూడా ఎయిర్పోర్టులో కరోనా పరీక్షలు చేశారు.
ఫలితాలు వచ్చేవరకు ఆమె అక్కడే క్వారంటైన్లో ఉండాల్సి ఉండగా, అక్కడ నుంచి పరారై రాజమహేంద్రవరం రావడానికి బయలుదేరారు. ఆమె ఢిల్లీ నిజాముద్దీన్ ట్రైన్ ఎక్కినట్టు పసిగట్టిన పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ఇంగ్లండ్ నుంచి 23వ తేదీ అర్ధరాత్రి ఆంగ్లో ఇండియన్ మహిళ, ఆమె కుమారుడు రాజమహేంద్రవరం వచ్చారు. వీరిని ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు.