నూతన ఆస్తి పన్ను విధానాన్ని రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-03T05:54:08+05:30 IST
నూతన ఆస్తి పన్ను విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.

- రాజమహేంద్రవరం కార్పొరేషన కార్యాలయం వద్ద సీపీఎం ధర్నా
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 2: నూతన ఆస్తి పన్ను విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలపై పన్నుల భారాలను మోపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి టీ అరుణ్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే పన్నుల రూపంలో భారాలను మోపడం సరికాదన్నారు. ఏడాది కట్టే ఇంటి పన్ను రూ.4800 నుంచి రూ.27,075కు పెంచడం దారుణమన్నారు. అలాగే నీటి చార్జిలు, చెత్తపై పన్ను, భూగర్భ డ్రైనేజీ పన్నులకు సంబంధించిన ఆర్డినెన్స్ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను మంజూరు చేయకపోగా పన్నుల భారాలను మోపడం సరికాదని విమర్శించారు. ధర్నాలో సీపీఎం నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి.పవన్, బి.పూర్ణిమరాజు, వి.రాంబాబు, ఎం.శ్రీనివాసరావు, సోమేశ్వరరావు, రాము పాల్గొన్నారు.