కార్మికులను అడ్డుకుంటే ఉపేక్షించం
ABN , First Publish Date - 2020-04-03T11:59:58+05:30 IST
కట్టుబాట్లు పేరుతో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లలో పనులకు వెళ్లనీయకుండా కార్మికులను అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి హెచ్చరించారు.
రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లకు అండగా ఉంటాం
గ్రామాల్లో కట్టుబాట్లు పేరుతో అడ్డుకుంటే సహించం
గ్రామ పెద్దలకు అవగాహన కల్పించాలి
యూనిట్లను సందర్శించిన కలెక్టర్ మురళీధర్రెడ్డి
కాకినాడ/ తాళ్లరేవు, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కట్టుబాట్లు పేరుతో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లలో పనులకు వెళ్లనీయకుండా కార్మికులను అడ్డుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి హెచ్చరించారు. తాళ్ళరేవు మండలం కోరంగిలోని రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రొయ్యల హార్వెస్టింగ్ సీజన్ ప్రారంభమైందని.. ఆక్వా రంగం, రైతు ప్రయోజనాలు దృష్ట్యా ప్రభుత్వ సూచనల మేరకు యూనిట్లు యథావిధిగా పనిచేయాలని ఆదేశించారు. లాక్డౌన్ దృష్ట్యా కంపెనీల్లో పనిచేసే కూలీలు, కార్మికులను గ్రామాల్లో కుల సంఘ పెద్దలు పనులకు వెళ్లనీయకుండా కట్టుబాటు విధించిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. కార్మికులు లేక ప్రాసెసింగ్ కార్యకలాపాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని యూనిట్ల ప్రతినిధులు కలెక్టర్కు వివరించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆక్వా రంగం కీలకంగా ఉందని, కొవిడ్-19 వైరస్ కట్టడికి లాక్డౌన్ ప్రకటించినప్పటికీ ప్రొసెసింగ్ యూనిట్లలో హైజనిక్ వాతావరణంలో పనిచేస్తే వైరస్ వ్యాప్తి చెందదన్నారు.
జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ సోకదనే నమ్మకాన్ని సంఘాల పెద్దల్లో కల్పించాలని, ఎటువంటి అపోహలు లేకుండా కార్మికులను పనులకు పంపేలా మత్స్యశాఖ అధికారులు, యూనిట్ల యాజమాన్యాలు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరారు. యూనిట్లకు కార్మికులను తీసుకువచ్చి తిరిగి పంపే వాహనాల్లో పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలన్నారు. కంపెనీల్లో పనిచేసే కార్మికుల వివరాలను సంబంధిత తహశీల్దార్ల ద్వారా ఆర్డీవోలకు అందజేయాలన్నారు. శుక్రవారం నుంచి జిల్లాలో అన్ని ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఆయన వెంట మత్స్యశాఖ ఉన్నతాధికారులు కోటేశ్వరరావు, జయరావు, ఫిషరీస్ డెవల్పమెంట్ ఆఫీసర్లు ఉన్నారు.
యాజమాన్యాలతో సమావేశం
కలెక్టరేట్లో రొయ్యల ప్రాసెసింగ్ ప్రతినిధులతో కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పనుల్లోకి రానీయకుండా ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రతినిధులకు భరోసా ఇచ్చారు. కొంత మంది వ్యక్తులు అపోహలు సృష్టించి కార్మికులను ప్లాంటుకు వెళ్లనీయకుండా వారి ఉపాధిపై ప్రభావం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆటంకం కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మత్స్యశాఖ అదనపు సంచాలకుడు పి.కోటేశ్వరరావు, జేడీ పి.జయరావు, వీరభద్ర ఎక్స్పోర్ట్స్, దేవీ ఫిషరీస్, దేవీ ఆక్వాటెక్, కోస్టల్ ఆక్వా, ఎఫెక్స్, ప్రోజోన్ ప్రొసెసింగ్ యూనిట్ల యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.