ఎమ్మెల్యే వేదాలు వల్లించడం విడ్డూరం
ABN , First Publish Date - 2020-12-01T06:58:41+05:30 IST
అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతూ వేదాలు వల్లించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
అనపర్తి, నవంబరు 30: అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతూ వేదాలు వల్లించడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సిరసపల్లి నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం మండలంలోని దుప్పలపూడిలో విలేకర్లతో వారు మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సిరసపల్లి మాట్లాడుతూ తనపై ఎమ్మెల్యే చేసిన అవినీతి ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నీరు చెట్లు పథకంలో టెండర్ల విధానం ద్వారా తవ్వకాలు చేశామని, ఇప్పుడు మీరు రంగంపేట మండలం మొదలుకొని బిక్కవోలు మండల కాపవరం వరకు చేస్తున్న అక్రమ గ్రావెల్ మైనింగ్ నియోజకవర్గం మొత్తానికి తెలుసునని పేర్కొన్నారు. తాము ఇప్పటి వరకు కాపవరం గ్రావెల్ తవ్వకాలపై ఎన్ని విమర్శలు చేసినా ఇప్పటి వరకూ నోరు విప్పకపోవడంలో ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో అవినీతి, సారా విక్రయాలు, పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని వీటిపై ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు కర్రి వెంకటరామారెడ్డి, నాయకులు తమలంపూడి సుధాకరరెడ్డి, కర్రి వెంకటరెడ్డి, మామిడిశెట్టి శ్రీను, నూతిక బాబూరావు, గంగిరెడ్డి పాల్గొన్నారు.