రైతులను మిల్లర్లు ఆదుకోవాలి
ABN , First Publish Date - 2020-12-02T05:25:35+05:30 IST
తుఫాన్ కారణంగా రంగు మారిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకుని, ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ కోరారు.
కాకినాడ,డిసెంబరు1(ఆంధ్రజ్యోతి): తుఫాన్ కారణంగా రంగు మారిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తీసుకుని, ఆపదలో ఉన్న రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ కోరారు. రైస్ మిల్లర్లతో మంగళవారం ఆయన కలెక్టరేట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ క్రమంలో జిల్లాలో సుమారు 42 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దెబ్బతిందన్నారు. రైతులను ఆదుకునే క్రమంలో వారిని ఇబ్బందులకు గురి చేయకుండా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ప్రధానంగా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ఈ.లక్ష్మిరెడ్డి, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.