వక్ఫ్‌ భూముల పరిరక్షణకు చర్యలు

ABN , First Publish Date - 2020-10-07T08:24:18+05:30 IST

జిల్లాలో వక్ఫ్‌ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు అన్నారు...

వక్ఫ్‌ భూముల పరిరక్షణకు చర్యలు

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు 6: జిల్లాలో వక్ఫ్‌ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఆక్రమణలు తొలగించి 134 ఎకరాల భూమిని జిల్లా వక్ఫ్‌ పరిరక్షణ కమిటీకి అప్పగించామని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు అన్నారు. వెలగపూడి నుంచి ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అంజాద్‌ బాషా, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి డీఆర్‌వో సత్తిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వక్ఫ్‌ పరిరక్షణ కమిటీ మొదటి సమావేశం ఈ ఏడాది జనవరిలో నిర్వహించామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 134 ఎకరాల్లో ఆక్రమణలు తొలగించి కమిటీకి అప్పగించామన్నారు. అమలాపురం, కొత్తపేట, పిఠాపురం, బిక్కవోలు ప్రాంతాలలో పెండింగ్‌ లో ఉన్న 122 ఎకరాల భూమిని త్వరితగతిన కమిటీకి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ సమావేశం నిర్వహించాలని మంత్రి అంజాద్‌ బాషా డీఆర్‌వోకు సూచించారు. మైనారిటీ సంక్షేమ శాఖ డీడీ పీఎస్‌ ప్రభాకరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-07T08:24:18+05:30 IST