తెలుగు మీడియంలోనే పాఠాలు?
ABN , First Publish Date - 2020-05-09T08:06:10+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంలోనే బోధన చేయాలని పట్టుబడుతున్నా కార్యాచ రణలో మాత్రం ఆ పరిస్థితి లేనట్టే
1 నుంచి 6 వరకూ పాఠ్య పుస్తకాలు నిల్ 7 నుంచి పదో తరగతి దాకా సిద్ధం
ఆర్టీసీ బస్సుల్లో మండలాలకు తరలింపు 13,03,320 కొత్త పుస్తకాలు
(ఆంధ్రజ్యోతి- రాజమహేంద్రవరం)
రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంలోనే బోధన చేయాలని పట్టుబడుతున్నా కార్యాచ రణలో మాత్రం ఆ పరిస్థితి లేనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠ్యపుస్తకాల విక్రయ కేంద్రం నుంచి జిల్లాలోని పాఠశాలలకు చేరుతున్న పుస్తకాలన్నీ తెలుగు మీడి యంకు సంబంధించినవే. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ పుస్తకాలు ఏటా మాదిరిగా ఈసారీ ముద్రించారు. వాటినే జిల్లాలోని పాఠశాలలకు పంపిస్తున్నారు. కరోనా వల్ల ఆగస్టు నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని చెబుతున్నారు. సాధారణంగా జూన్లో పాఠశాలలు తెరిచేవారు. ఇక ఏటా కొన్ని రకాల పుస్తకాలు వచ్చేవి కావు. పరీక్షలు సమీపించే సమయానికి కూడా కొన్ని పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థులు ఎదురుచూసేవారు.
ఇప్పుడు సమయం ఉందికాబట్టి అన్ని రకాల పుస్తకాలను సిద్ధం చేయాలని విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే బొమ్మూరులోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా విక్రయ కేంద్రంలో ప్రస్తుతం 7వ తరగతి నుంచి 10 తరగతి వరకూ పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా టెన్త్మ్యాథ్స్ (ఇంగ్లీషు మీడియం), 9వ తరగతి మాథ్స్ (ఇంగ్లీషు మీడియం), 9వ తరగతి పరిసరాల విజ్ఞానం పుస్తకాలు రావలసి ఉంది. కానీ ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలేమీ ఈ కేంద్రానికి చేరలేదు. సిలబస్ మారిందా లేదా అనే సమాచారం లేదు.
ఆ తరగతుల పుస్తకాలొచ్చేశాయి..
తమ పుస్తక విక్రయ కేంద్రానికి ఇప్పటివరకు 7వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన 13 లక్షల 3 వేల 320 పుస్తకాలు కొత్తవి వచ్చాయని, 4 లక్షల 50 వేలు పాత స్టాకు ఉందని బొమ్మూరులోని ప్రభుత్వ పాఠ్యపుస్తకాల జిల్లా విక్రయకేంద్రం జిల్లా మేనేజర్ జి.జేమ్స్హేరీ తెలిపారు. మొత్తం టార్గెట్ 13 లక్షల 99 వేలు అన్నారు. ఒకటి నుంచి 6వ తరగతికి సంబంధించిన పుస్తకాలేవీ ఇంతవరకూ రాలేదన్నారు. వాటి సిలబస్ మార్పు చేర్పుల గురించి కూడా తమకు సమాచారం లేదని, అవి రాగానే పాఠశాలలకు సరఫరా చేస్తామని తెలిపారు. ఇక ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడి పుస్తకాలను మండల కేంద్రాలకు తరలించడం ప్రారంభించారు. రోజుకు 7 మండలాలకు సంబంఽధించిన పుస్తకాలు ఆర్టీసీ ప్రత్యేక బస్సులలో పంపుతుండగా, ఇప్పటివరకూ 3 లక్షల 41 వేల పుస్తకాలు పంపించారు.
వలస కార్మికుల కోసం రైలు వస్తోంది
లాక్డౌన్తో జిల్లాలో చిక్కుకుపోయిన వలస కూలీలను తరలించే ప్రయత్నం చేస్తున్నట్టు రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ చెప్పారు. ఇతర రాష్ర్టాల కార్మికులను పంపించడానికి సన్నాహాలు చేస్తున్నామని, రెండు మూడు రోజుల్లో ప్రత్యేక రైలు రాబోతున్నట్టు ఆయన తెలిపారు. నన్నయ్య విశ్వవిద్యాలయం, కాతేరు ఫంక్షన్హాల్లో సుమారు 260 మంది వలస కూలీలు ఉన్నారన్నారు. రాజానగరం మండలం లో ఉత్తరాంధ్ర, కృష్ణా జిల్లాలకు చెందినవారు ఉన్నార ని, వారిని కూడా త్వరలోనే పంపిస్తామని చెప్పారు.