ఆక్రమణలో ఉన్న దళితుల భూమిని స్వాధీనం చేసుకోవాలి
ABN , First Publish Date - 2020-10-04T09:34:55+05:30 IST
ఆక్రమణలో ఉన్న దళితుల భూమిని స్వాధీనం చేసుకోవాలి
ఏలేశ్వరం, అక్టోబరు 3: భూస్వాముల ఆక్రమణలో ఉన్న దళితుల భూమిని స్వాధీనం చేసుకోవాలని, భూ తగాదాపై హైకోర్టులో సివిల్ కేసు కొనసాగుతున్నప్పటికీ అక్రమ కేసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరంలో దళితులు శనివారం ఆందోళన చేపట్టారు. సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏగుపాటి అర్జునరావు నాయకత్వంలో పార్టీ శ్రేణులు, జె.అన్నవరం గ్రామ దళితులు పాల్గొన్నారు. పట్టణ వీధుల్లో నిరసన ప్రదర్శన చేసి బాలాజీచౌక్ సెంటర్లో రాస్తారోకో, పోలీస్స్టేషన్వద్ద ధర్నా నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్యకర్తలు ఆవరణలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. తహశీల్దార్ రజనీకుమారికి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మసకపల్లి ధనబాబు, సాబే కొమ్మయ్య, నాగులాపల్లి అర్జునుడు, ఎద్దు బుజ్జమ్మ, బూరుగు చంటి తదితరులు పాల్గొన్నారు.