కాకినాడలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగాడంటే!
ABN , First Publish Date - 2020-04-01T18:18:07+05:30 IST
కాకినాడ బ్యాంకుపేటకు చెందిన ఓ వ్యక్తికి..
కాకినాడ(ఆంధ్రజ్యోతి): కాకినాడ బ్యాంకుపేటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అతడిని వైద్యులు అదుపులోకి తీసుకుని చికిత్స అందిస్తున్నారు. వారి కుటుంబీకులను రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు ఐసోలేషన్ వార్డులో అబ్జర్వేషన్లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ వ్యక్తి మార్చి 17న ఢిల్లీ నుంచి ఏపీ ఎక్స్ప్రెస్లో ఎస్2 కంపార్టుమెంట్లో బయల్దేరి మరుసటి రోజు 18 మధ్యాహ్నం 1.30 గంటలకు సామర్లకోట చేరుకున్నాడు. మధ్యాహ్నం కాకినాడ బ్యాంకుపేట సమీపంలో ఉన్న ఓ మసీదుకు వెళ్లాడని చెబుతున్నారు. 20వ తేదీన ఇంటి వద్ద నుంచి సర్పవరం వెళ్లి అక్కడ ఓ హోటల్ వద్ద టీ తాగాడని, అక్కడి నుంచి పిఠాపురంలోని నూర్ మసీదుకు వెళ్లాడని సమాచారం.
21న మళ్లీ కాకినాడలో ఓ మసీదుకు వెళ్లాడు. ఈ వ్యక్తి కుటుంబీకులు మార్చి 27, 28 తేదీల్లో నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్మాల్లో కొన్ని వస్తువులు కొనుగోలు చేశారు. ఆదివారం చికెన్ కొనుగోలుకు బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇతడు మార్చి 18 నుంచి 29 వరకు 11 రోజులు కుటుంబ సభ్యులు ఐదుగురితో కలిసే ఉన్నారు. వాళ్లను కలిసిన బంధువులు, స్నేహితులు మామూలుగానే తిరిగారు. ఎక్కువరోజులు వీరు బయట తిరగడంతో ఈ వైరస్ కాకినాడలో ఎంతమందికి సోకింది అనే వివరాలు తెలుసుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ మల్లగుల్లాలు పడుతోంది. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.