పక్కా ప్రణాళికతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2020-12-19T06:06:58+05:30 IST

కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జిల్లాలో సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి అధికారులను ఆదేశించారు.

పక్కా ప్రణాళికతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
కలెక్టరేట్‌లో జేసీ అధ్యక్షతన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ

జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), డిసెంబరు18: కొవిడ్‌ -19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జిల్లాలో సజావుగా జరిగేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జేసీ అధ్యక్షతన జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను  ప్రభుత్వ, ప్రైవేటు హెల్త్‌కేర్‌ వర్కర్లకు అందిస్తామన్నారు.  దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఈ వ్యాక్సిన్‌పై ప్రజలపై అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేసే విధంగా జిల్లా స్థాయి అధికారులు కృషి చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా స్థాయి అధికారులు సమన్యయంతో పని చేయాలని ఆమె తెలిపారు. వ్యాక్సిన్‌ నిల్వ, పంపిణీ, విద్యుత్‌, రూట్‌ మ్యాప్‌లకు సంబంఽధించి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.  అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, మహిళా పోలీస్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌తో కూడిన ఐదుగురు సభ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తామన్నారు.  ప్రతి సెషన్‌కు 100 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జేసీ అధికారులకు సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీ గౌరీశ్వరరావు, రాజమహేంద్రవరం డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ టి.రమేష్‌కిశోర్‌, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం రాఘవేంద్రరావు, సోషల్‌ వెల్ఫేర్‌ జేడీ జె.రంగలక్ష్మీదేవి, సెట్రాజ్‌ సీఈవో ఎం.భానుప్రకాష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-19T06:06:58+05:30 IST