పూర్తిస్థాయి వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-11-03T05:50:15+05:30 IST

గిరిజనులకు వైద్య సేవలందించడంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు.

పూర్తిస్థాయి వైద్యసేవలు
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ కీర్తి

  జేసీ కీర్తి చేకూరి
రంపచోడవరం, నవంబరు 2: గిరిజనులకు వైద్య సేవలందించడంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు  జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన ప్రాంత వైద్యాధికారులతో సోమవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో మాతాశిశు మరణాల రేటును తగ్గించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడంతో పాటు సిబ్బంది కొరత తీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్టు ఆమె తెలిపారు. పిన్‌పాయింట్‌, సర్వేలెన్సు పిచికారీ కార్యక్రమాలు పగడ్బంధీగా అమలుచేస్తూ మలేరియా వ్యాధుల నివారణకు పాటుపడాలన్నారు. ప్రాంతీయ ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలు, ప్రసూతి వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్‌ ద్వారా గర్భిణుల ఆరోగ్య భద్రతకు పాటు పడాలన్నారు. పీహెచ్‌సీ, ఆరోగ్య ఉప కేంద్రాల్లో తాగునీటి వసతుల కల్పనకు జలజీవన్‌ మిషన్‌ ద్వారా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. వైద్యసేవల నిమిత్తం 35 శాటిలైట్‌ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయని జేసీ తెలిపారు. ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ఆదిత్య, వైద్యాధికారులు రాజ్‌కుమార్‌, కార్తీక్‌, రాజామోహన్‌, అనూష, ఎంపీహెచ్‌వోలు గోవిందబాబు, రాజు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-03T05:50:15+05:30 IST