బాలిక కుటుంబాన్ని ఆదుకుంటాం
ABN , First Publish Date - 2020-07-22T14:08:02+05:30 IST
అత్యాచారానికి గురైన బాధిత బాలిక కుటుంబాన్ని..
కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం అర్బన్: అత్యాచారానికి గురైన బాధిత బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ మాట్లాడుతూ ఘటన పూర్తి వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ రమేష్కిశోర్, వైసీపీ మాజీ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిళ, కొల్లివెలసి హారిక, ట్రేడ్ యూనియన్ నాయకుడు వాసంశెట్టి గంగాధర్ ఉన్నారు.
బాధితురాలికి పలువురి పరామర్శ, ఆర్థిక సాయం
ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలిని పలు సంఘాలు, రాజకీయ పార్టీలు, దళిత సంఘాల నాయకులు పరామర్శించారు. అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాల మేరకు ఏఐబీసీఎఫ్ నాయకులు వాసంశెట్టి గంగాధర్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు పప్పు దుర్గారమేష్, జిల్లాసభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. బాలికను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ, బీఎస్పీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పట్నాల విజయకుమార్, వైసీపీ దళిత ఆర్మీ నేత అరుణ్ జేకే, ఈతకోట బాపనసుధారాణి, మాసా రామ్జోగ్, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, రాజా, తిరగటి దుర్గ పరామర్శించారు.