అనుమతి లేకుండా ఎలా తవ్వుతారు!
ABN , First Publish Date - 2020-05-09T08:00:28+05:30 IST
గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని కోటలంకవారి(పెదచెరువు)లో మట్టి తవ్వకాలను శుక్రవారం సాయంత్రం
చేబ్రోలు పెదచెరువ చెరువులో మట్టి తవ్వకాలు
గ్రామస్థుల అడ్డగింపు.. ఉద్రిక్తత
గొల్లప్రోలు రూరల్, మే 8: గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని కోటలంకవారి(పెదచెరువు)లో మట్టి తవ్వకాలను శుక్రవారం సాయంత్రం గ్రామస్థులు అడ్డుకున్నారు. చెరువులో మట్టిని తవ్వి ప్రభుత్వం అందించబోయే ఇళ్లస్థలాల (లేఅవుట్) అభివృద్ధి నిమిత్తం తరలిస్తున్నట్టు చెబుతున్నారు. తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని, ఎలా తరలిస్తారని గ్రామస్థులు ప్రశ్నించారు. మట్టి తవ్వుతున్న ఎక్స్కవేటర్లు, తరలిస్తున్న లారీలను అడ్డుకుని కదలనివ్వలేదు. దీంతో గొల్లప్రోలు ఎస్ఐ రామలింగేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.
ప్రభుత్వ అవసరాల నిమిత్తం మట్టిని తరలిస్తున్నారని, అడ్డుకోవడం తగదని ఆందోళన చేస్తున్న వారికి చెప్పారు. గతంలో ఇరిగేషన్ అధికారులు అనుమతి లేదని చెప్పారని, ఇప్పుడు ఎలా తవ్వుతారని ప్రశ్నించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడంతో పోలీసు జీపును అడ్డుకున్నారు. తవ్వకాలు జరగనిచ్చేది లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు. కాగా 10వేల క్యూబిక్మీటర్ల మట్టి తవ్వకానికి అనుమతి ఇచ్చినట్టు ఇరిగేషన్శాఖ అధికారులు తెలిపారు.