నిరసన ధ్వనులు

ABN , First Publish Date - 2020-12-27T07:28:24+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్లస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు నిరసన గళం వినిపిస్తున్నారు.

నిరసన ధ్వనులు
నిలదీస్తున్న లబ్ధిదారులు

ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్న  ఇళ్ల లబ్ధిదారులు 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్లస్థల పట్టాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు నిరసన గళం వినిపిస్తున్నారు.  స్థానికేతరులకు ఇళ్లస్థల పట్టాలు పంపిణీ చేస్తున్నారంటూ కొన్నిచోట్ల, అనర్హులకు పట్టాల పంపిణీ చేయడం దారుణమంటూ కొన్ని చోట్ల రోడ్లెక్కి మరీ నిరసనలు తెలుపుతున్నారు.  రాజోలు మండలం వేగివారిపాలెంలో నిరసన గళం వినిపించారు. రాజోలు మండలం వేగివారిపాలెంలో అనర్హులకు పట్టాలు ఇస్తున్నారని, సామాజిక కులవివక్ష ప్రదర్శిస్తూ ఒక వర్గం వారికి చెందిన పేర్లను తొలగించారని ఆరోపిస్తూ ప్రజాప్రతినిధులను నిలదీశారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, మాల కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ పాల్గొన్న కార్యక్రమంలో సభాస్థలిలో ఉన్న లబ్ధిదారులు ఒక్కసారిగా ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులకు పట్టాలు ఇస్తున్నారని, ఇక్కడ ఒక వర్గంవారి పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారంటూ ఎమ్మెల్యే రాపాక, అమ్మాజీలను నిలదీశారు. ఆందోళనకారులను శాంతింప చేసేందుకు పోలీసులతో పాటు ప్రజాప్రతినిధులు పదేపదే విజ్ఞప్తులు చేశారు. తహశీల్దార్‌ వేదికపైకి వచ్చి లబ్ధిదారుల ఎంపికలో జరిగిన విషయాలను వివరించారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలతో వారు శాంతించారు.  అల్లవరం మండలం బోడసకుర్రులో కొందరికే ఇళ్లస్థల పట్టాలు, ప్లాట్లు పంపిణీ చేశారని, మిగిలిన వారిని సభా స్థలికి ఆహ్వానించినప్పటికీ వారికి పట్టాలు మంజూరు చేయలేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లస్థల పట్టాలకు ఎంపికైన లబ్ధిదారులతో పాటు డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలను ఇళ్లస్థల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలంటూ అధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో వారు నిరసన వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-12-27T07:28:24+05:30 IST