బాలికను వంచించిన వ్యక్తికి యావజ్జీవం
ABN , First Publish Date - 2020-11-26T05:45:37+05:30 IST
బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని వంచించిన కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదుతో పాటు ఏడు వేల రూపాయల జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సి. సత్యవాణి బుధవారం తీర్పు వెలువరించారు.

కాకినాడ క్రైం, నవంబరు 25: బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని వంచించిన కేసులో నిందితుడికి యావజ్జీవ ఖైదుతో పాటు ఏడు వేల రూపాయల జరిమానా విధిస్తూ కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సి. సత్యవాణి బుధవారం తీర్పు వెలువరించారు. అమలాపురం రూరల్ మండలం కామనగరువుకు చెందిన గోసంగి అజయ్కుమార్ అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు. దాంతో ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో పెళ్లికి అజయ్కుమార్ నిరాకరించాడు. ఈ విషయమై 2015లో అమలాపురం రూరల్ పోలీస్స్టేషన్లో బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదనల అనంతరం నిందితుడు అజయ్కుమార్పై నేరం రుజువు కావడంతో బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడినందుకు జీవితఖైదు, రూ.5 వేలు జరిమానా, మాయమాటలు చెప్పి వంచించినందుకు మరో ఏడాది జైలు, పెళ్లి చేసుకునేందుకు వరకట్నం అడిగినందుకు మరో ఏడాది జైలు, రూ. 2 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎండీ అక్బర్ ఆజామ్ వ్యవహరించారు.