ఇళ్లకే పరిమితం కండి

ABN , First Publish Date - 2020-03-24T07:03:13+05:30 IST

కరోనా వైరస్‌ నిర్మూలనకు నిరంతరం అప్రమత్తంగా ఉండి చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌

ఇళ్లకే పరిమితం కండి

వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటిస్తే వైరస్‌ కట్టడి

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌.. కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి 


కాకినాడ, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నిర్మూలనకు నిరంతరం అప్రమత్తంగా ఉండి చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. జేసీ లక్ష్మిశతో కలిసి సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 వైరస్‌ను దూరం చేయాలంటే ఈనెల 31 వరకు ప్రజలు గృహాలకే పరిమితం కావాలని, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటిస్తే దీన్ని పారదోలడం సులభమని అన్నారు.


ప్రజలకు అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు.  అత్యవసర పరిస్థితుల్లో ఆటో, ట్యాక్సీలకు మాత్రమే అనుమతించేలా పోలీసు, రవాణాశాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ2 రాజకుమారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సత్యసుశీల, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావు, డీపీవో నాగేశ్వర్‌ నాయక్‌, అడ్మిన్‌ ఎస్పీ కుమార్‌, సివిల్‌ సప్లయిస్‌ డీఎం జయరాములు, డ్వామా పీడీ శ్యామల, ఆర్టీవో వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-24T07:03:13+05:30 IST