ధర్మవరంలో దారి మల్లిన స్ర్తీనిధి రుణాలు

ABN , First Publish Date - 2020-12-06T05:59:08+05:30 IST

ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో స్ర్తీ నిధి రుణాల సొమ్ము దారి మళ్లింది. రెండు డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.లక్షా 50 వేల రుణాలు పక్క దారి పట్టాయి

ధర్మవరంలో దారి మల్లిన స్ర్తీనిధి రుణాలు

ప్రత్తిపాడు, డిసెంబరు 5ః ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో స్ర్తీ నిధి రుణాల సొమ్ము దారి మళ్లింది. రెండు డ్వాక్రా సంఘాలకు చెందిన రూ.లక్షా 50 వేల రుణాలు పక్క దారి పట్టాయి.  స్నేహ డ్వాక్రా సంఘానికి రూ. లక్షా 50 వేలు, శివశంకర్‌ సంఘానికి రూ. 2 లక్షలు స్ర్తీ నిధి రుణాలు మంజూరయ్యాయి. ఏడాది కిందట మంజూరైన ఈ రుణాలను అప్పట్లో కొంత సొమ్మును తగ్గించి ఆయా సంఘాలకు అందజేశారు. స్నేహ సంఘానికి రూ. లక్షా 50 వేలు మంజూరైతే లక్ష రూపాయలే అందించారు. అలాగే శివశంకర్‌ సంఘానికి రూ. 2 లక్షలు మంజూరైతే ఆ సంఘానికి లక్ష రూపాయలు తగ్గించి మిగిలిన రూ.లక్షను అందజేశారు. దీంతో ఈ రెండు సంఘాలు నెలవారి చెల్లించాల్సిన వాయిదాలు తగ్గడంతో అధికారులకు అనుమానం వచ్చింది.  వాస్తవంగా శివశంకర్‌ సంఘం నెలవారీ వాయిదా రూ. 10 వేలు, స్నేహ సంఘం  రూ. 7,500 చెల్లించాల్సి ఉండగా రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నాయి. దీంతో అధికారులు ఆరా తీయగా రూ. లక్షా 50 వేలు దారి మళ్లినట్లు తెలిసింది.  దీనిపై మండల ఏపీఎం ఆర్‌.సన్యాసిరావును వివరణ కోరగా సీసీకి మెమో ఇచ్చామని, 3 రోజుల్లో దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 

Updated Date - 2020-12-06T05:59:08+05:30 IST