ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2020-03-08T09:11:45+05:30 IST
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారులకు మండల స్థాయి అధికారులు సహకరించాలని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి

కాకినాడ, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారులకు మండల స్థాయి అధికారులు సహకరించాలని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ఆదేశించారు. తన చాంబర్ నుంచి శనివారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయిందని దీంతో ఈ ప్రక్రియ ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికల నిర్వహణలో గ్రామ, వార్డు వలంటీర్లకు ఎటువంటి బాధ్యతలు అప్పగించవద్దన్నారు. వారికి ప్రత్యామ్నాయంగా మాస్టర్ ట్రైనర్స్ను ఎంపిక చేసుకోవాలన్నారు.
ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బ్యాక్సులు అందుబాటులో ఉన్నాయని, త్వరలో వాటిని జిల్లాపరిషత్ ద్వారా ఆయా మండలాలకు పంపుతామన్నారు. బ్యాలెట్ పత్రాలు ప్రింటింగ్, నెంబరింగ్ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించాలన్నారు.
బందోబస్తుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ధన, మద్యం ప్రభావం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల మెటీరియల్ విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. జేసీ-2 రాజకుమారి, జడ్పీ సీఈవో జ్యోతి, డీపీవో నాగేశ్వర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.