వరద నీరు తొలగింపునకు కల్వర్టులు నిర్మించాలి
ABN , First Publish Date - 2020-10-13T07:09:09+05:30 IST
వరద నీరు తొలగింపునకు యుద్ధప్రాతికన కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు.
![వరద నీరు తొలగింపునకు కల్వర్టులు నిర్మించాలి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మంత్రి కన్నబాబు..ఎస్.అచ్యుతాపురంలో పర్యటన
సర్పవరం జంక్షన్, అక్టోబరు 12: వరద నీరు తొలగింపునకు యుద్ధప్రాతికన కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో ముంపునకు గురైన 48వ డివిజన్ ఎస్.అచ్యుతాపురం జనచైతన్యకాలనీలో ఎంపీ వంగా గీతతో కలిసి పర్యటించారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడల్లా రోజుల తరబడి కాలనీ వరదనీటిలో నివసిస్తున్నామని, గాడేరు కాలువ నుంచి వరద నీరు వస్తుందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గాడేరు నుంచి వరద నీరు కాలనీలోకి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని, గాడేరు గట్టు రివిట్మెంట్, పటిష్టతకు అయ్యే నిధులు స్మార్ట్సిటీ నిధుల నుంచి మంజూరుకు కృషి చేయాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్కు సూచించారు. వరద నీటిలో చిక్కుకున్న 30మంది ఉప్పర్ల కుటుంబానికి స్థానిక పునరావాస సహాయ కేంద్రానికి తరలించి, వారికి ఆహారం, తాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో చిన్నికృష్ణ, తహశీల్దార్ వేముల మురళీకృష్ణ, వైసీపీ నేతలు పెదపాటి నాగబాబు, దేవరాజ్,జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.