-
-
Home » Andhra Pradesh » East Godavari » covid hospitala cancels
-
కొవిడ్ ఆసుపత్రులు ఎత్తివేత
ABN , First Publish Date - 2020-10-31T07:03:42+05:30 IST
జిల్లాలో కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు ఎత్తివేస్తున్నారు. నవంబరు ఒకటి నుంచి ఇక అన్నీ నాన్ కొవిడ్ ఆసుపత్రులే. వాటిలో చాలాచోట్ల జనరల్ వైద్యంతోపాటు కొవిడ్కు కూడా కొన్ని బెడ్స్ కేటాయిస్తున్నారు.

రేపటి నుంచి అన్నీ నాన్కొవిడ్ ఆసుపత్రులే
బొమ్మూరు క్వారంటైన్ సెంటర్ మూత
రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో ఒకటి నుంచి ఓపీ ప్రారంభం
ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్ వైద్యం
కలెక్టర్ ఉత్తర్వులు జారీ
ఇక ప్రైవేట్ ఆసుపత్రులే దిక్కు
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు ఎత్తివేస్తున్నారు. నవంబరు ఒకటి నుంచి ఇక అన్నీ నాన్ కొవిడ్ ఆసుపత్రులే. వాటిలో చాలాచోట్ల జనరల్ వైద్యంతోపాటు కొవిడ్కు కూడా కొన్ని బెడ్స్ కేటాయిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బొమ్మూరు క్వారంటైన్ మాత్రం ఎత్తివేశారు. అక్కడి వైద్యులు, సిబ్బందిని రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్, బోడసకుర్రు క్వారంటైన్ సెంటర్లకు పంపిస్తున్నారు. సుమారు 100కు పైగా ఇక్కడ ఉన్న పాజిటివ్ బాధితులను వేరేచోట్లకు తరలిస్తున్నారు. టిడ్కో ఇళ్లలో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో బొమ్మూరు ఎత్తివేయగా, బోడసకుర్రును మాత్రం కొనసాగిస్తున్నారు. కోనసీమలో ఇటీవల ఎక్కువ కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం ఈ సెంటర్లో 550 మంది బాధితులున్నారు. ఇక్కడ వెయ్యికి పైగా బెడ్స్ ఉన్నాయి. మిగతాచోట్ల అన్ని ఆసుపత్రులు నాన్కొవిడ్ ఆసుపత్రులుగా మారిపోతాయి. జిల్లా కలెక్టర్ ఇప్పటికే సంబంధిత అధికార్లకు ఆదేశాలిచ్చారు.
ఇక హోంక్వారంటైన్కే ప్రాధాన్యం
జిల్లాలో కరోనా బాఽధితులందరికీ ఇక ప్రభుత్వ వైద్యం అందకపోవచ్చు. ప్రభుత్వ క్వారంటైన్ సెంటరు బోడసకుర్రు ఒకటే ఉంది. అది కోనసీమ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుంది. ఏజెన్సీ, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు ఇప్పటివరకూ బొమ్మూరు క్వారంటైన్ సెంటర్ ఉపయోగపడింది. కొద్దిరోజుల కిందట నుంచే ఇక్కడ అడ్మిషన్లు నిలిపివేశారు. మెయింటెన్స్ ఎక్కువకావడంతోపాటు గతంలోకంటే కొవిడ్ కేసులు తక్కువ నమోదవుతుండడం వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ కొవిడ్ టెస్ట్లు కూడా తగ్గాయి.
రాజమహేందవ్రరం ప్రభుత్వాసుపత్రిలో ఓపీ ప్రారంభం
రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబరు ఒకటి నుంచి జనరల్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సోమవారం నుంచి అవుట్ పేషెంట్(ఓపీ) సేవలు కూడా మొదలవుతాయి. ఈ ఆసుపత్రికి రోజూ వందలాదిమంది పేదలు వివిధ వైద్య సేవలకోసం వచ్చేవారు. కొవిడ్ ఆసుపత్రిగా మార్చడంతో జనరల్ సేవలు ఆగిపోయాయి. పేదలు ఇబ్బందులు పడ్డారు. కానీ కొవిడ్ బాధితులకు ఈ ఆసుపత్రి బాగా ఉపయోగపడింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడు నుంచి 10 లక్షల వరకూ డిపాజిట్ చేస్తేనేకాని అడ్మిట్ చేసుకోని పరిస్థితుల్లో కొందరికి ఇది ఉపయోగపడింది.
ప్రైవేట్ ఆసుపత్రులే గతి
కొవిడ్ ఆసుపత్రులను నాన్కొవిడ్ ఆసుపత్రులుగా మార్చేయడంతో ఇక ప్రైవేట్ ఆసుపత్రులే గతయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం పాజి టివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టవచ్చు. కానీ డిసెంబరు నుంచి రెండో దఫా వైరస్ విజృంభించవచ్చని వైద్యులే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభు త్వ ఆసుపత్రుల్లో కొంతమేర బెడ్స్ ఏర్పాటు చేసినప్పటికీ అందరికీ వైద్యం అందే అవకాశం ఉండదు. కొవిడ్ విజృంభణ ఎక్కువగా ఉన్న సమయంలో జిల్లాలో ప్రైవేట్ కొవిడ్ ఆసుపత్రులు ఎంతగా దోచేశాయో అందరికీ తెలిసిందే. రోజుకు రూ.50 వేలు వసూలు చేసిన ఆసుపత్రులు కూడా ఉన్నాయి. అక్కడ వెంటిలేటర్లు, ఆక్సిజన్, రూమ్ రెంట్లు, వైద్యుడి విజిట్ చార్జీలే అధికం. వాడే మందులు ఎక్కడైనా ఒకటే. ఒకటి రెండు రకాలు అదనం కావచ్చు. పేషెంట్ దగ్గరకూ కూడా రారు. ఆన్లైన్ సేవలకు కూడా బాగానే లాగేశారు. శుక్రవారం జిల్లాలో 405 పాజిటివ్ కేసులు నమోదుకాగా, కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 1,15,373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఓ సంతోషం.. ఓ భయం
కొవిడ్ ఆసుపత్రులను నాన్కొవిడ్ ఆసుపత్రులుగా మార్చేయడం వల్ల ప్రభుత్వాసుపత్రుల్లో జనరల్ వైద్యం మొదలవుతుంది. సదరం క్యాంపులు, కంటివెలుగు వంటి సేవలు కూడా ప్రారం భం కానున్నాయి. అంతేకాక ఓపీ వల్ల అనేకమంది పేదలు వైద్యసేవలు పొందుతారు. కానీ కొవిడ్ ఆసుపత్రులు లేకపోవడంతో సామాన్యులు అందరికీ సేవలు అందవనే భయం వెన్నాడుతోంది.
రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి
అమరావతి పరిరక్షణ సమితి ప్రదర్శన
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు30: అమరావతి రైతులను జైలుకు తరలించడానికి వారి చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ శనివారం కలెక్టరేట్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వ ర్యంలో అఖిలపక్ష నాయకులు ప్రదర్శన జరిపి అనం తరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ‘అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు- రౌడీషీటర్లకు రాచమర్యాదలు’ అంటూ ప్రదర్శనలో నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్ జేఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, కాకినాడ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు తోకల ప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల శివ, ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల వరప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు, నవీన్లు మాట్లాడుతూ అమరావతి రాజధాని కొనసాగించాలని సంవత్సర కాలంగా ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారన్నారు. దీనికి పోటీగా కొంతమంది పెయిడ్ ఆర్టిస్ట్లతో పోటీ ఉద్యమం చేయించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాన్ని నిలదీసిన రైతులపై ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయడం దారుణమైన చర్యని అన్నారు. రిమాండ్ నుంచి జైలుకు తరలించే క్రమంలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడం దారుణమైన విషయమన్నారు. ఈ కార్యక్రమం లో పలు సంఘాల నాయకులు గదుల సాయిబాబా, తాళ్లూరి రాజు, కొల్లాబత్తుల అప్పారావు, మల్లిపూడి వీరు, అంబటి చిన్న, చింతపల్లి కాశి, సీకోటి అప్పలకొండ, తుమ్మల రమేష్, వొమ్మి బాలాజీ, జోగా రాజు, రహీమ్, చింతలపూడి రవి, బంగారు సత్యనారాయణ పాల్గొన్నారు.