తూర్పులో వైరస్ విలయం.. ఇప్పటిదాకా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..
ABN , First Publish Date - 2020-07-18T13:44:55+05:30 IST
తూర్పు గోదావరి జిల్లాను కొవిడ్ పట్టిపీడిస్తోంది. ఎక్కడికక్కడ వందల్లో కేసులు పెరిగిపోతున్నాయి. టెస్ట్లు చేయించుకునేకొద్దీ పాజిటివ్లు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. దీంతో ఏజెన్సీ మినహా కేసులు కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసులు 608
ట్రునాట్, ఆర్టీపీసీఆర్లో 293, ర్యాపిడ్ కిట్ల ద్వారా 315 నిర్ధారణ
కాకినాడలో 138, రాజమహేంద్రవరం 102, పెద్దాపురం 50, అంబాజీపేట 33
మండపేట 32, గండేపల్లి 23, కిర్లంపూడి 21, ఉప్పలగుప్తం 16, రంగంపేట 13
ముందస్తుగా 20 వేల కొవిడ్ కిట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశాలు
ఇకపై రోడ్డుపైకి వస్తే మాస్క్ తప్పనిసరి .. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసులు: 608
ఇప్పటి వరకు నమోదైన మొత్తంకరోనా కేసులు: 5564
ట్రూనాట్ ద్వారా శుక్రవారం రాత్రికి గుర్తించిన కేసులు: 300(వీటిని శనివారం ప్రకటిస్తారు)
(కాకినాడ,ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లాను కొవిడ్ పట్టిపీడిస్తోంది. ఎక్కడికక్కడ వందల్లో కేసులు పెరిగిపోతున్నాయి. టెస్ట్లు చేయించుకునేకొద్దీ పాజిటివ్లు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. దీంతో ఏజెన్సీ మినహా కేసులు కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా శుక్రవారం 608 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రునాట్, ఆర్టీపీసీఆర్లో 293, ర్యాపిడ్కిట్ల ద్వారా 315 నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా కాకినాడ నగరంలో 138 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఇవన్నీ జగన్నాథపురం, రేచర్ల పేట, కచేరీపేట, రామారావుపేట, సూర్యారావు పేట, కొండయ్యపాలెం.. ఇలా పలు వార్డుల్లో నమోదయ్యాయి. దీంతో నగరంలో కేసుల సంఖ్య మొత్తం వెయ్యికిపైగానే చేరుకున్నట్టు అధికారులు వివరించారు. జిల్లాలో ప్రతిరోజు నమోదవుతున్న పాజిటివ్ల్లో అత్యధికంగా కాకినాడ నగరం ఉండడంతో రెడ్జోన్లు రెట్టింపయ్యాయి. రాజమహేంద్రవరంలో 102 పాజిటివ్లు గుర్తించారు. దాదాపు నగరంలో అన్నిచోట్లా ఇవి నమోదయ్యాయి. పెద్దాపురంలో కేసుల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం 50 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇటీవల పాజిటివ్ వచ్చిన కేసుల కాంటాక్ట్స్ సంబంధించి వీరంద రికి వైరస్ వ్యాపించింది.
అంబాజీపేటలో 33 మందికి కొవిడ్ సోకింది. ఆర్టీపీసీఆర్, ట్రునాట్, ర్యాపిడ్ కిట్లు కలిపి ఇన్ని కేసులు వచ్చినట్టు వైద్యులు వివరించారు. గండేపల్లిలో ఇటీవల పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తుల ద్వారా మండలంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. రెండ్రోజుల కిందట పాజిటివ్ సోకిన వ్యక్తుల కాంటాక్ట్స్ కింద 23 కేసులు గుర్తించారు. కాజు లూరు 15, కాకినాడ రూరల్ 14, రాజమహేం ద్రవరం సిటీ, రూరల్ కలిపి 102, మండపేట 32, కిర్లంపూడిలో 21, ఉప్పలగుప్తం 16, రంగంపేట 13 చొప్పున పాజిటివ్లు తేలాయి. ఇక కాకినాడ కార్పొరేషన్ ఐటీ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు, తాళ్లరేవులో తహశీల్దార్, వీఆర్వోకు పాజిటివ్గా తేలింది. కాట్రేనికోనలో పంచాయతీ సిబ్బంది, ఓ గర్బిణీ, ఓ గ్రామ వలంటీర్ కలిపి మొత్తం ఏడుగురికి పాజిటివ్గా రిపోర్టులు వచ్చాయి. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు పీఏకు పాజిటివ్ గా వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటిరకు జిల్లాలో మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 5,564కు చేరాయి. మరోవైపు జిల్లాలో రానురాను పెరుగుతున్న కేసులతో కొవిడ్ లక్షణాలు ఉన్న వారిని మాత్రమే హాస్పిటల్స్కు తరలిస్తున్నారు.
పెద్దగా లక్షణాలు లేనివారిని, తక్కువ వయస్సు ఉన్న వారిని హోంఐసోలేషన్కు అనుమతి ఇస్తున్నారు. దీంతో ఇంట్లోనే కొవిడ్తో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య రానురాను పెరుగుతోంది. అటు బుధవారం నుంచి పెరిగిన టెస్ట్లకు అనుగుణంగా పెద్దఎత్తున వస్తున్న పాజిటివ్లతో అధికారులు మరింత అప్రమత్తం అవుతున్నారు. కోనసీమలోని బోడసకుర్రు కొవిడ్ ఆస్పత్రిని సిద్ధం చేశారు. జూలై, ఆగస్టు నెలల్లో అత్యంత భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కొవిడ్ ప్రత్యేక అధికారి కృష్ణబాబు శుక్రవారం అధికారింగా వెల్లడించారు. ఈ హెచ్చ రికల నేపథ్యంలో జిల్లాలో ముందస్తు మందుల లభ్యతను సిద్ధం చేస్తు న్నారు. మరోపక్క కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై రహదారి పైకి వచ్చేవారు, పని ప్రదేశాల్లోను కచ్చితంగా మాస్క్ ధరించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.