మహిళ సాధికారతే ప్రభుత్వ ధ్యేయం
ABN , First Publish Date - 2020-12-01T06:21:59+05:30 IST
మహిళ సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి భద్రత,రక్షణ కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చట్టాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు.
కలెక్టర్ మురళీధర్ రెడ్డి
కాకినాడ,నవంబరు30(ఆంధ్రజ్యోతి): మహిళ సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, వారి భద్రత,రక్షణ కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చట్టాలపై మహిళలకు విస్తృత అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశానికి సంబంధించి సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర మహిళ కమిషన్ ఆధ్వర్యంలో నవంబరు 30 నుంచి వచ్చే మార్చి 8 వరకు జిల్లా వ్యాప్తంగా మహిళల సంరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించడం శుభపరిణామమన్నారు. ఎస్పీ అస్మి మాట్లాడుతూ మహిళ సాధికారత కోసం తమ శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. దిశ చట్టం రాష్ట్రంలో అమల్లో ఉన్నా ఇంకా అక్కడక్కడా మహిళలపై దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతుండడం బాధాకరమన్నారు. రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు గల కారణాలు, వాటి మూలాల నుంచి మార్పు తీసుకురావడానికి తమ టీం కృషి చే స్తుందన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పద్మజ మాట్లాడుతూ మహిళలందరూ తమ హక్కులు, మహిళల కోసం రూపొందించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. జేసీలు సీహెచ్ కీర్తి, జి.రాజకుమారి, డీఈవో ఎస్.అబ్రహాం, డీఆర్డీఏ పీడీ వె.హరిహరనాథ్, మెప్మా పీడీ రమణి, సర్వశిక్షా సొసైటీ ఏపీసీ విజయభాస్కర్, ఐసీడీఎస్ పీడీ పుష్పమణి పాల్గొన్నారు.