పురపోరుకు సన్నద్ధంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-02-08T07:54:09+05:30 IST
జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులంతా సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి

అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
కలెక్టరేట్, ఫిబ్రవరి 7: జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికారులంతా సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి పురపాలక ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్. రమేష్కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి, ఎస్పీ అద్నన్ నయీం అస్మీలు కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏడు పురపాలక సంఘాలు, మూడు నగరపాలక పంచాయతీలు, ఒక నగరపాలక సంస్థకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. జిల్లా నుంచి 8.5 లక్షల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు.
బ్యాలెట్ బాక్సులను కేరళ, తమిళనాడు నుంచి జిల్లాకు వచ్చాయన్నారు. వచ్చేనెల 3న ఓటర్ల జాబితా ప్రచురణ, ఫిబ్రవరి 5న పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు, ఎలక్షన్ కోడ్ అమలుకు సన్నద్ధతతో ఉన్నామని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో మునిసిపల్ ఆర్డీ జి.నాగరాజు, కాకినాడ అదనపు కమిషనర్ నాగనరసింహారావు, డీఎస్పీలు ఎస్.రాంబాబు, మురళి, తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, రామచంద్రపురం, మండపేట, అమలాపురం, ముమ్మిడివరం, ఏలేశ్వరం, రాజమహేంద్రవరం మునిసిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేటట్టు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు, మార్గదర్శకాలు తప్పకుండా పాటించాల న్నారు. రిజర్వేషన్ల విషయం కోర్టు పరిధిలో ఉన్నందున, తీర్పు వెలువడగానే నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ 20 రోజులలో పూర్తయ్యేటట్టు చేస్తున్నారన్నారని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ గతంలో 27 రోజులు పట్టేదని, ఇవాళ 20 రోజులకు తగ్గించే అవకాశం ఉందన్నారు.