వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాజయం తప్పదు

ABN , First Publish Date - 2020-12-15T06:46:50+05:30 IST

ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌ను ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాజయం తప్పదు
ములగపూడిలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

   కమీషన్లు రాబట్టుకునేందుకే 56 మంది సలహదారుల నియామకం

  మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు 

రౌతులపూడి, డిసెంబరు 14: ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ఇప్పటికే రూ.2.40 లక్షల కోట్లు అప్పు చేసి దోచుకున్నారని, కొందరు గ్రామ వలంటీర్లు సర్వేల పేరుతో ఇళ్లకు వెళ్లి వృద్ధుల మెడల్లో గొలుసులు లాక్కొంటున్నారని ఆరోపించారు.  వచ్చే ఎన్నికల్లో సీఎంకు ఘోర పరాజయం తప్పదని అన్నారు. ములగపూడిలో సోమవారం నిర్వహించిన వన సమారాధనలో ఆయన మాట్లాడుతూ అప్పులు తెచ్చి దోచుకోవడం, దాచుకోవడం తప్ప జైలు నుంచి వచ్చిన వ్యక్తికి ఇంకేం తెలుసన్నారు. తన 38 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత దరిద్ర, పిరికి ముఖ్యమంత్రిని చూడలేదని వ్యాఖ్యానించారు. కడప సింహాన్ని అనే చెప్పుకునే ముఖ్యమంత్రి రాజధాని ప్రాంత మహిళలకు భయపడి 1600 మంది పోలీసుల కాపలాతో అసెంబ్లీకి వెళ్లారని విమర్శించారు. మద్యంలో వచ్చే కమీషన్లు తనకే అని, వాటి జోలికి ఎమ్మెల్యేలను వెళ్లవద్దని జగన్‌ హెచ్చరించారని ఆరోపించారు. గ్రామాల్లో చెత్త మందు దొరుకుతుంటే తుని ఎమ్మెల్యే దగ్గర ఖరీదైన మందు దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో ఎమ్మెల్యేలు కుబేరులయ్యారని అయ్యన్న చెప్పారు.  కొవిడ్‌ రోగులకు స్టార్‌ హోటల్‌ మెనూ చూపించి రాగి జావ తాగించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని అయ్యన్న అన్నారు.  టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, నేతలు వరుపుల రాజా, యనమల కృష్ణుడు, తమరాన సత్యనారాయణ, గంటా గోపి, వేమల సురేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-15T06:46:50+05:30 IST