బ్యాగ్లో పెట్టిన రూ.1.60 లక్షలు మాయం
ABN , First Publish Date - 2020-11-03T06:03:13+05:30 IST
అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వచ్చిన వ్యక్తి బ్యాగులో రూ.లక్షా 60 వేల నగదు చోరీకి గురైంది.
రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 2: అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వచ్చిన వ్యక్తి బ్యాగులో రూ.లక్షా 60 వేల నగదు చోరీకి గురైంది. తొండంగి మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన ఇర్లపాటి ప్రసాదరావు తొండంగిలో విద్యుత్శాఖలో ఎల్ఐగా పనిచేస్తున్నాడు. గతనెల 31న తన సొంత, ఆఫీసు పనుల నిమిత్తం రూ.లక్షా 60 వేల నగదు తీసుకుని బ్యాగ్లో పెట్టుకుని అన్నవరం చేరుకుని మెట్రోలగ్జరీ బస్ ఎక్కి సాయంత్రం 4:30 గంటలకు రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ సెంటర్కు చేరుకున్నాడు. అక్కడ ఆటో ఎక్కి గోదావరి బండ్పైకి చేరుకున్నాడు. అక్కడ విద్యుత్ బిల్లింగ్ మిషన్ మరమ్మతులు చేయించుకుని డబ్బులు ఇచ్చేందుకు బ్యాగ్ చూడగా దాంట్లోని రూ.లక్షా 60 వేల నగదు కనిపించలేదు. బాధితుడు టూటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఆటోలో ఉన్న వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశాడు.