రెండు వర్గాల ఘర్షణ
ABN , First Publish Date - 2020-06-05T11:13:25+05:30 IST
ఎన్.కొత్తపల్లిలో గురువారం ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి.
నలుగురికి గాయాలు
పోలీస్ పికెట్ ఏర్పాటు
ఉప్పలగుప్తం, జూన్ 4: ఎన్.కొత్తపల్లిలో గురువారం ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాలు కొట్లాడుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణరాజుకు అనుకూలంగా గత నెల 20న జరిగిన ఆందోళన, అతడిపై జరిగిన దర్యాప్తు నేపథ్యంలో గ్రామంలో రెండు వర్గాల మధ్య వార్ జరుగుతోంది. గత నెల 27న పంచాయతీ కార్యాలయంలో విచారణ సందర్భంగా తనపై దాడికి తలపడ్డారని అంగాని వీర్రాజు గురువారం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య మాటామటా పెరిగి కొట్లాటకు దారి తీసింది. ఇరు వర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. ఆసుపత్రి వైద్యుల నివేదికల మేరకు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్టు అమలాపురం రూరల్ సీఐ రుద్రరాజు భీమరాజు తెలిపారు.
కొట్లాటకు దిగిన రెండు వర్గాల సభ్యులు వైసీపీకి చెందిన వారే కావడం గమనార్హం. ఇరువర్గాలు పోలీస్స్టేషన్ వద్ద మొహరించడంతో ఓ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా కొట్లాటకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా అన్నారు. ఎన్.కొత్తపల్లిలో కొట్లాట జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. గ్రామంలో టౌన్ సీఐ సురేష్బాబు, స్థానిక ఎస్ఐ కె.సురేష్బాబు పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. అనంతరం పోలీస్స్టేషన్ వద్ద ఇరు వర్గాల వారితో మాట్లాడి, హెచ్చరికలు జారీ చేశారు. రాజీ చేసేందుకు వచ్చిన పెద్దలను తీవ్రస్థాయిలో మందలించారు.