పారిశుధ్య వర్కర్ల కోసం 20 ఆర్టీసీ బస్సులు
ABN , First Publish Date - 2020-04-08T09:28:08+05:30 IST
రాజమహేంద్రవరం సిటీలో పారిశుధ్య కార్మికులు విధుల్లోకి వెళ్లడానికి, డ్యూటీలు పూర్తయిన తర్వాత ఇళ్లకు చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు

రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 7: రాజమహేంద్రవరం సిటీలో పారిశుధ్య కార్మికులు విధుల్లోకి వెళ్లడానికి, డ్యూటీలు పూర్తయిన తర్వాత ఇళ్లకు చేరుకోవడానికి వీలుగా ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది. మంగళవారం 20 ఆర్టీసీ బస్సులను రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులకు అప్పగించారు. ప్రతిరోజూ నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ అధికారులు సూచించిన రూట్లలో, నియమిత సమయాల్లో ఈ బస్సులను నడుపుతారు. నగరపాలక సంస్థకు 20 బస్సులు కేటాయించామని, నిర్వహణ మొత్తం ఆర్టీసీదేనని డీఎం సత్యనారాయణ మూర్తి తెలిపారు. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ ప్రతిరోజూ 20 బస్సులు కేటాయిస్తామన్నారు.
మొబైల్ రైతుబజార్ కోసం ఆర్టీసీ బస్సు
మొబైల్ రైతుబజార్ కోసం రాజమహేంద్రవరం డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సును మార్కెటింగ్శాఖ అధికారులకు అప్పగించారు. మార్కెటింగ్శాఖ సూచనల మేరకు ఆర్టీసీ బస్సులో మొబైల్ రైతుబజార్ నిర్వహిస్తారు. కూరగాయలను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లి రైతుల ద్వారా విక్రయాలు జరుపుతారు.