అధికారులపై ఈసీ వేటుకు కారణాలివే!
ABN , First Publish Date - 2020-03-16T11:18:46+05:30 IST
అధికారులపై ఈసీ వేటుకు కారణాలివే!
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్ష అభ్యర్థుల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయద్దంటూ బెదిరించడం, అడ్డుకోవడం, నామినేషన్ పత్రాలను లాక్కోవడం, చించేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. నామినేషన్లు దాఖలు చేసిన ప్రతిపక్ష అభ్యర్థులను ఇదే రీతిలో బెదిరించి, ప్రలోభపెట్టి ఉపసంహరించుకునేలా చేశారు. కొందరు అభ్యర్థుల సంతకాలు ఫోర్జరీ చేసి కూడా విత్ డ్రా చేయించారు. సంబంధిత స్థానాలను ఏకగ్రీవాలుగా ప్రకటించుకున్నారు. ఈ ఘటనలు ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో, చంద్రగిరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ చోటుచేసుకున్నాయి. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ తప్పిదాలకు పాల్పడిన సందర్భాల్లో వీటిని నియంత్రించాల్సిన, అడ్డుకోవాల్సిన బాధ్యత కలెక్టర్, ఎస్పీలపై ప్రధానంగా వుంటుంది.జిల్లాలో శాంతిభద్రతలకు ప్రధాన బాఽధ్యుడు కలెక్టర్. ఆ తర్వాతే ఎస్పీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో జరిగిన అక్రమాల గురించి ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా కొందరు బాధిత అభ్యర్థులూ నేరుగా ఫిర్యాదు చేశారు. వీటికి ఆధారాలనూ సమర్పించారు. మీడియా కూడా ఆధారాలతో అక్రమాలను వెలుగులోకి తెచ్చింది.వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఘటనలకు కలెక్టర్, తిరుపతి అర్బన్ ఎస్పీలను బాధ్యులుగా గుర్తించి వారిపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు శ్రీకాళహస్తి డీఎస్పీ నాగేంద్రుడు, పలమనేరు డీఎస్పీ ఆరిఫుల్లా,పుంగనూరు సీఐ గంగిరెడ్డిలపై అదే వేటు పడింది. జిల్లాలో మొత్తం పరిణామాలకు కలెక్టర్ను బాధ్యుడిని చేయగా, తిరుపతి నగర పాలక ఎన్నికలు, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాలకు చెందిన కొన్ని మండలాల్లో జరిగిన ఘటనలకు తిరుపతి అర్బన్ ఎస్పీని బాధ్యుడిని చేసింది ఈసీ. స్థానికంగా శ్రీకాళహస్తిలో జరిగిన హింసాత్మక ఘటనలకు అక్కడి డీఎస్పీని, పుంగనూరు ఘటనలకు పలమనేరు డీఎస్పీని,పుంగనూరు సీఐని బాధ్యులను చేసి వారిపైనా చర్యలకు సిఫారసు చేసింది.
సహకరించిన స్థానిక యంత్రాంగం మాటేమిటి?
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పరంగా పుంగనూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో మాత్రమే తప్పిదాలు జరగలేదు. తంబళ్ళపల్లెలో మొత్తం 72 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం ఎలా అయ్యాయనేది పెద్ద ప్రశ్నగా మారింది. టీడీపీ ఎంతో బలంగా వున్న ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా గ్రామస్థాయిలో పార్టీ ఉనికి కాపాడేందుకు శ్రేణులు ఎంతకైనా సిద్ధపడే పరిస్థితి వుంది. అటువంటి చోట వందశాతం స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోవడం బెదిరింపులు, ప్రలోభాలతోనేనన్నది బహిరంగ రహస్యం. చంద్రగిరి నియోజకవర్గం మొత్తం ఇదే రీతిలో అక్రమాలు జరిగాయి. జీడీనెల్లూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి సతీమణి పరంజ్యోతి ఏకగ్రీవంగా గెలవడం కోసం కార్వేటినగరం జడ్పీటీసీ పదవికి ప్రత్యర్థి మహిళా అభ్యర్థిని బెదిరించి నామినేషన్ విత్డ్రా చేయించారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలకు బాఽధ్యులైన అధికారులపై ఈసీ చర్యలకు సిఫారసు చేయకపోవడం గమనార్హం. మరోవైపు అధికార పార్టీ నేతల ఆగడాలకు క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు శక్తిమేరా సహకరించారు. రిటర్నింగ్ అధికారుల ఎదుటే పలుచోట్ల నామినేషన్లు లాక్కుని పారిపోవడం, చించేయడం జరిగాయి. కొన్ని ఘటనలు పోలీసు అధికారులు, సిబ్బంది ఎదుటే జరిగాయి. ఎవ్వరూ వీటిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇటువంటి ఘటనలకు వీడియో దృశ్యాలు కూడా ఆధారాలుగా వున్నాయి. వీటితో పాటు నామినేషన్ల పరిశీలన సందర్భంగా ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్లను అకారణంగానూ, స్వల్ప కారణాలతోనూ తిరస్కరించిన అధికారులున్నారు. జిల్లా , డివిజన్ స్థాయిల్లో నలుగురు అధికారులపై చర్యలకు సిఫారసు చేసిన ఈసీ మిగిలిన వారిపై చర్యలు తీసుకోకపోవడం జనానికి అసంతృప్తి కలిగిస్తోంది.