అక్కచెల్లెమ్మల ఆనందమే ధ్యేయం
ABN , First Publish Date - 2020-12-29T06:38:41+05:30 IST
అక్కచెల్లెమ్మల ఆనందమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు
ఊరందూరు సభలో ముఖ్యమంత్రి జగన్
శ్రీకాళహస్తి /శ్రీకాళహస్తి అర్బన్, తిరుపతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):అక్కచెల్లెమ్మల ఆనందమే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.శ్రీకాళహస్తి మండలం ఊరందూరు సమీపంలో సోమవారం మధ్యాహ్నం పేదలందరికీ ఇళ్లు పథకం కింద జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. భారీ సంఖ్యలో హాజరైన మహిళలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్లతో పాటు అన్ని నామినేటెడ్ పదవుల్లో 50శాతం స్థానాలు మహిళలతో భర్తీ చేస్తున్నామన్నారు. అమ్మఒడి,కాపునేస్తం, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, ఆసరా వంటి పథకాలు మహిళల పురోభివృద్ధి కోసమే రూపొందించామన్నారు.పక్కా ఇళ్ళ నిర్మాణం కోసం ప్రభుత్వానికయ్యే భారీ వ్యయాన్ని, భారాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నామన్నారు.ఊరందూరు వద్ద ఒకే లే అవుట్లో 6,232మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్లు చెప్పారు.ఈ లే-అవుట్లో ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఇక్కడ కొత్త శ్రీకాళహస్తి ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కాలనీలో నివసించే వారి కోసం పాఠశాల, కల్యాణ మండపం, పార్కు, వైఎస్ఆర్ రైతుబజారు, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, వార్డు సెక్రటేరియట్, ఆటో స్టాండు వంటి వసతులు కల్పిస్తామన్నారు. నూతనంగా నిర్మించే వైఎస్ఆర్ జగన్ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటి మౌళిక వసతులు ప్రత్యేకంగా కల్పిస్తామన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంతో పాటు రెండు ప్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎల్ఈడీ బల్బులు, ఒక సింథటిక్ ట్యాంకు ఉచితంగా అందచేస్తామన్నారు.రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు పట్టాలు పంపిణీ చేసి... ఇళ్లు నిర్మించి ఇస్తున్నామన్నారు.ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మొత్తం వైసీపీకి అండగా ఉన్నారన్నారు. బీసీల అభివృద్ధి కోసం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు.పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం 2,763 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. భూ సేకరణ కోసం రూ.379.36 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
ఆకట్టుకోని సీఎం ప్రసంగం
ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం సభికులను ఆకట్టుకోలేక పోయింది. నేతలు చేసిన విజ్ఞప్తులపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.విజయవాడ నుంచీ సోమవారం ఉదయం 10.45 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకోవాల్సిన ముఖ్యమంత్రి 35 నిమిషాలు ఆలస్యంగా 11.20 గంటలకు వచ్చారు. సభా ప్రాంగణానికి 12 గంటలకు చేరుకున్నారు. పైలాన్ ఆవిష్కరించి 12.11 గంటలకు సభా వేదికపైకి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు విమానాశ్రయానికి వెనుదిరగాల్సి వుండగా గంట ఆలస్యంగా 2 గంటలకు వెనుదిరిగారు. కాగా సభకు జిల్లావ్యాప్తంగా బస్సులు, మినీ బస్సులు ఏర్పాటు చేసి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను తరలించారు.జనాన్ని తరలించడానికి ప్రైవేటు పాఠశాలల బస్సులను కూడా వినియోగించుకున్నారు. నియోజకవర్గం నుంచీ ట్రాక్టర్లపై కూడా మహిళా సంఘాల సభ్యులు రావడం కనిపించింది.వాహనాల సంఖ్య ఎక్కువ కావడంతో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై చాలాసేపు ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఇక ఊరందూరు మార్గంలో కూడా ట్రాఫిక్ స్తంభించి పోయి... సభకు వచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సభలో వైసీపీ కార్యకర్తల సంఖ్య తక్కువగా వుండడంతో సీఎం సభావేదికపైకి వచ్చినపుడు పెద్దగా స్పందన కనిపించలేదు.రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాల గురించి సీఎం గణాంకాలతో సభికులకు వివరించే ప్రయత్నం చేశారు. అయితే సభలో దాదాపు 90శాతం మహిళలు కావడంతో వారికి అర్థం కాక బిక్క మొహం వేశారు. ఇలా జరగడం వైసీపీ నాయకులను నిరాశ పరిచింది.

సీఎం విన్పించుకోని డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే వేడుకోళ్ళు
సభలో తొలుత మాట్లాడిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సోమశిల-స్వర్ణముఖి కాలువ పనులు పెండింగ్లో వున్నాయని, వాటిని పూర్తి చేయడానికి రూ. వంద కోట్లు అవసరమవుతాయని వివరించారు. సీఎం పాదాలకు మొక్కి అడుగుతున్నాం... ఆ నిధులు మంజూరు చేస్తే నియోజకవర్గానికి చాలా మేలు చేసినట్టవుతుందని, అదనంగా 40 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు. తర్వాత మాట్లాడేందుకు వెళుతూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సీఎం జగన్ వద్ద ఆగి ఆయన కాళ్ళకు నమస్కరించారు. ప్రసంగంలో ఆయన కూడా జీడీనెల్లూరు నియోజకవర్గాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం కక్షకట్టి అభివృద్ధి లేకుండా చేసిందని ఆరోపించారు. అభివృద్ధి పనులకు రూ. 400 కోట్లు అవసరమని, ఆ నిధుల మంజూరు కోసం సీఎం పాదాలు పట్టుకుని బతిమాలుతున్నామన్నారు.అయితే జగన్ తన ప్రసంగంలో వీరి విజ్ఞప్తులపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు. వాటి గురించి కనీసం ప్రస్తావించకపోయడం వారిని నిరాశకు గురి చేసింది. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ఇంఛార్జి మంత్రి గౌతమ్రెడ్డి, ఆపై డిప్యూటీ సీఎంలు నారాయణస్వామి, ధర్మాన కృష్ణదాస్, అటు తర్వాత హౌసింగ్ మంత్రి మాట్లాడాల్సి వుంది. సమయం సరిపోకపోతే మిగిలిన వారికి అవకాశం ఇవ్వక్కర్లేదు కానీ బహిరంగసభలో జిల్లా ఇంఛార్జి మంత్రికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అలాగే డిప్యూటీ సీఎం హోదా కలిగిన రెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్కూ ప్రసంగించే అవకాశం దక్కలేదు. చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్పర్సన్ ఆర్కే రోజా, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, వెంకటే గౌడ, ఆరణి శ్రీనివాసులు, నవాజ్ బాషా, ద్వారకనాధరెడ్డి, ఎమ్మెస్ బాబు, ఆదిమూలం, రెవిన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి, సీసీఎల్ఏ నీరబ్కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
