అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ABN , First Publish Date - 2020-12-21T05:14:32+05:30 IST

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
మృతిచెందిన శశికళ

కేవీపల్లె, డిసెంబరు 20: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన కేవీపల్లె మండలం మారెళ్ల పంచాయతీ తురకపల్లెలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఎస్‌ఐ రామ్మోహన్‌ కథనం మేరకు... చిన్నగొట్టిగల్లు మండలం రాజువారిపల్లెకు చెందిన చిన్నయర్రయ్య, శారదమ్మ కుమార్తె శశికళను కేవీపల్లె మండలంలోని తురకపల్లెకు చెందిన ఎం.వెంకట్రమణ, అలివేలమ్మల కుమారుడు బలరాంతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఐదేళ్ల కుమారుడితోపాటూ ఏడాది వయసు బాబు, పాప కవలలున్నారు. బలరాం కుటుంబ పోషణ నిమిత్తం కువైట్‌లో ఉన్నాడు. ఇటీవల అత్తింటి వేధింపులు అధికమయ్యాయంటూ తరచూ భర్తకూ, తల్లిదండ్రులకు శశికళ తనగోడు తెలిపేది. ఈక్రమంలో ఆదివారం మధ్యాహ్నం తండ్రికి ఫోన్‌చేసి పుట్టింటికి వస్తున్నానని చెప్పింది. ఇంతలో ఏమైందో ఏమో ఇంట్లోనే ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని  పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా తమ బిడ్డను అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శశికళ తల్లిదండ్రులు చెప్పారు.తమ అల్లుడు కువైట్‌కు వెళ్లినప్పటినుంచి అత్తమామలతోపాటు మరుదులు రాజు, రవి  వేధించేవారన్నారు. 

Updated Date - 2020-12-21T05:14:32+05:30 IST