కారు బోల్తా.. భార్యాభర్తల మృతి
ABN , First Publish Date - 2020-12-11T06:51:32+05:30 IST
కడపజిల్లా రైల్వే కోడూరు మండలంలోని కుక్కలదొడ్డి సమీపంలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.
నలుగురికి గాయాలు ఫ వివాహానికి వచ్చి వెళుతుండగా ప్రమాదం
మృతులది తిరుచానూరు
తిరుచానూరు, డిసెంబరు, 10: కడపజిల్లా రైల్వే కోడూరు మండలంలోని కుక్కలదొడ్డి సమీపంలో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో కారు బోల్తాపడింది. ఈ ఘటనలో భార్యాభర్తలు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలోని యోగిమల్లవరంలోని కార్తీక్ (39), ఉమామహేశ్వరి (35) దంపతులు కుటుంబ సమేతంగా రైల్వేకోడూరులో వివాహానికి వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. కుక్కలదొడ్డికి సమీపంలో వీరి కారు అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న కార్తీక్, ఉమామహేశ్వరి దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరి ఇద్దరు కుమారులు, ఆయనకు తమ్ముడు, తల్లి గాయపడ్డారు. వీరి పెద్దకుమారుడు గాయపడినా కారు అద్దాలు పగలగొట్టి బయటకు తీశాడు. రైల్వేకోడూరు సీఐ ఆనందరావు, ఎస్ఐ-1 పెద్ద ఓబన్న తమ సిబ్బందితో ప్రమాద స్థలికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం రాజంపేటకు తరలించారు. పోస్టుమార్టం నిర్వహించాక గురువారం రాత్రి మృతదేహాలను స్వగ్రామానికి పంపారు. కాగా, కార్తీక్కు తిరుపతి నగరం అన్నమయ్య సర్కిల్, పద్మావతిపురం సర్కిల్ వద్ద ఫర్నిచర్ దకాణాలున్నాయి.